బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తున్నది.గత పదేండ్ల కాలంలో ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చు కంటే వీరు దోచుకుని దాచుకున్నదే డబుల్ అని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు ఏదైనా కమీషన్ల ప్రకారం కాంట్రాక్టులు అప్పగించడం,షేర్ రాయించుకోడం, బినామీల పేర్ల మీద కోట్లు కొల్లగొట్టారని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అయితే, ఆరోపణలు ఘనంగా ఉన్నా ఆధారాలు మాత్రం ఎవరూ చూపించలేకపోతున్నారు. ఫలితంగా నోటి మాటలతో కోటలు కట్టలేం కదా? అన్నట్టుగా ఆయన్ను దోషిగా చిత్రీకరించడం ఎవరి వలన కావడం లేదు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలతో నానా రభస చేశారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేయిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారని, సహజ వనరులను కొల్లగొడుతున్నారని అందుకే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కేటీఆర్, హరీశ్ రావులు స్పీకర్ పోడియంను వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అక్రమ మైనింగ్, ఇసుక రీచ్లను ఎలా కొల్లగొట్టారో అధికార పార్టీ నేతలు, మంత్రులు రివర్స్ కౌంటర్ ఎటాక్ చేశారు.
కేటీఆర్ గత పదేండ్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, కొత్తగూడ, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో భారీగా భూములు కొల్లగొట్టారని, తక్కువ ధరకే కొందరికి భూబదలాయింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి . అందుకు గాను మున్సిపల్ మంత్రి, బీఆర్ఎస్ నేతలకు పెద్దఎత్తున కమీషన్లు అందుకున్నారని సైతం ప్రచారం సాగింది. ఇదంతా ఒక ఎత్తయితే పెట్టుబడుల పేరిట ఆయా కంపెనీలకు తక్కువ ధరకు స్థలాలు, మౌలిక వసతులు కల్పించి కోట్లల్లో పార్టీ ఫండ్ రాబట్టారని సైతం గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోని నేతలు వందల కోట్లకు ఎలా పడగలెత్తారని, కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ ఫాంహౌస్లు ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండగా అసెంబ్లీలో గులాబీ పార్టీ గుర్తుమీద గెలిచి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన తన సొంత భూమిని కూడా వదలలేదని వాపోయారు. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమి లాక్కున్నారని.. ఆనాడు ఏమీ చేయలేక మౌనంగా ఉండపోయానని బాంబు పేల్చారు. నిండు సభలో దానం నాగేందర్.. కేటీఆర్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.కాంగ్రెస్ పార్టీ సభ్యులు సైతం కేటీఆర్ అధికార, భూ దాహానికి అడ్డూ అదుపులేదని ఆరోపించారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనను సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అక్రమంగా ఇసుక తోడేస్తున్న వారిని అడ్డుకున్న స్థానికులపై ట్రాక్టర్లు, లారీలు ఎక్కి తొక్కించిన ఘటనను మర్చిపోయావా? అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో సభలో మరింత హీట్ పెరిగింది. కాగా, సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు తప్పుబట్టారు.