Seethakka: మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రసంగిస్తూ బిజెపి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బిసి తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా.. సభను పక్కదోవ పట్టిస్తూ బిజెపి సభ్యులు వాకౌట్ చేయడం వారి దురుద్దేశాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కనీసం తమ ఫ్లోర్ లీడర్గా కూడా ఒక బిసికి అవకాశం ఇవ్వని బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కుల గణనపై ప్రధాని వైఖరి
ప్రధాని నరేంద్ర మోదీ తాను బిసి అని చెప్పుకుంటారు తప్ప, బిసిల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సీతక్క వ్యాఖ్యానించారు. దేశంలో జనాభా లెక్కల సేకరణలో కుల గణనను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని ఆమె తప్పుపట్టారు. నామమాత్రపు బిసి నామకరణాలతో కాలం గడపడం తప్ప బిసి వర్గాలకు బిజెపి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
జిడిపిలో బిసిల పాత్ర.. సాంకేతిక సవాళ్లు
బిసిలను కేవలం వెనుకబడిన వర్గాలుగా చూడకూడదని, వారే ఈ దేశానికి ‘వెన్నెముక కులాల’ అని మంత్రి అభివర్ణించారు. దేశ జిడిపిలో, ఉత్పత్తి రంగంలో బిసిల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. సాంకేతికత వేగంగా పెరుగుతున్న ఈ కాలంలోనూ బిసిలు కులవృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. ఆ సాంకేతిక మార్పుల వల్ల వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం.. కాంగ్రెస్ కట్టుబాటు
దేశంలో బిసిలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని సీతక్క గుర్తుచేశారు. మొదటి ఓబిసి ప్రధాని దేవెగౌడకు సైతం కాంగ్రెస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన కోసమే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బిసి తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని కోరారు.
Also Read: డార్లింగ్ ప్రభాస్కే ప్రాంక్ కాల్ చేసిన KTR.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో!