YV Subbareddy: వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు వారిపై భూకబ్జా కేసు నమోదు చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక కారణమేంటి? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్దాం.
హైదరాబాద్ కొండాపూర్లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఈ వివాదానికి కేరాఫ్గా మారింది. తమ భూమిని రాజకీయ నేతలతో అండతో అనిల్రెడ్డి అనే వ్యక్తి కబ్జాకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ భూమి తమదంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి తరపున కొందరు కంప్లైంట్ చేశారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే… కొండాపూర్ సర్వేనెంబర్ 87లో 2.3 గుంటల భూమి ఉంది. దాదాపు 20 ఏళ్ల కిందట దాన్ని స్వర్ణలతారెడ్డి.. లక్ష్మయ్య, ఆయన ఫ్యామిలీ సభ్యుల నుంచి దాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ భూమిని ఎల్ అండ్ టీకి లీజుకు ఇచ్చారు. గడువు ముగిశాక ఆ సంస్థ మూడేళ్ల కిందట ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి ఖాళీగా ఉంది ఆ భూమి.
డిసెంబర్ చివరి వారంలో ఊరిలో లేని సమయంలో అనిల్రెడ్డి, అతని అనుచరులు తన సైట్లోకి చొరబడి పేరు, ఫోన్ నంబర్తో కూడిన బోర్డును ఏర్పాటు చేశారన్నది స్వర్ణలతారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. గడిచిన రెండు వారాలుగా భూమిపై మూడు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది.
ALSO READ: ఆటోలో సూపర్ బిజినెస్.. పట్టుకున్న పోలీసులు
మూడు రోజుల కిందట ల్యాండ్ ఆవరణలో కట్టిన ప్రహారీ గోడను జేసీబీతో కూల్చివేశారు వైవీ మద్దతుదారులు. గోడను కూల్చడానికి కారణమైన కూకట్పల్లి శివ, అనిల్ కుమార్, నాగిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులపై మూడు రోజుల కిందట వైవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కిందట ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.