Maganti Gopinath: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదంపై శేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారి (MRO) కుటుంబు సభ్యులను విచారించారు. ఇరు వర్గాల వాదనలు విన్న MRO తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. MRO విచారణకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి, మాలినీ దేవి తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. గోపీనాథ్ భార్య సునీత తరఫు న్యాయవాది, వారి చిన్న కుమార్తె దీశిరా కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాలినీ దేవి న్యాయవాది ఆంటోనీ, ఆమె దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పత్రాన్ని MROకు సమర్పించారు.
ఈ విచారణ అనంతరం మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, అయితే గోపీనాథ్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘మా కొడుకు ఎలా మృతి చెందాడు? న్యాయంగా విచారణ చేయండి’ అని ఆమె కోరారు. తమకు తెలియకుండా హడావుడిగా గోపీనాథ్ అంత్యక్రియలు చేశారని ఆమె ఆరోపించారు.
ఆస్తి వివాదంపై తమ న్యాయపోరాటం కొనసాగుతుందని మహానందకుమారి తెలిపారు. గోపీనాథ్ వారసులు ఎవరనేది భగవంతుడు, న్యాయవాదులు, కోర్టులు తేల్చాలని ఆమె వ్యాఖ్యానించారు. మాలినీ దేవి దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కోర్టు కొట్టివేసిన కాపీని MROకు ఇచ్చామన్నారు. తన మనుమడు తారక్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా.. కోర్టులో చూసుకోవాలని వారు చెప్పారని తెలిపారు. తన మనుమడి హక్కుల కోసం, అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.