Hyderabad: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీన్ని గమనించిన న్యాయవాది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. అసలేం జరిగింది?
మంత్రి శ్రీధర్బాబు దంపతులపై AI వీడియో తీవ్ర కలకలం
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన భార్య, ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్పై ఏఐ మార్ఫింగ్ వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. అభ్యంతరకర కంటెంట్తో కూడిన ఏఐ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇది ముమ్మాటికీ వారి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని భావించిన న్యాయవాది శశిభూషణ్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏఐ సాయంతో నకిలీ వీడియోలను తయారు చేసి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి మంత్రి శ్రీధర్బాబును తప్పుడుగా చూపించేలా వీడియోలు క్రియేట్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంథని పేరుతో నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజీ ద్వారా ఈ కంటెంట్ను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
న్యాయవాది ఫిర్యాదు.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
న్యాయవాది ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ పేజీని ఎవరు క్రియేట్ చేశారు? ఎక్కడ నుంచి పోస్టు చేశారు? ఏ ఐపీ అడ్రస్ నుంచి దాన్ని పోస్టు చేశారు? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.