Rural Roads: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ను తెలంగాణ అమలుచేస్తుంది. పల్లె రహదారుల అభివృద్ధిలో దేశానికి కొత్త మార్గాన్ని చూపుతోంది. ఇప్పటికే అసోం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర సంస్థలు కూడా తెలంగాణలో అమలు చేస్తున్న ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో పర్యటించి హ్యామ్ విధానం, అమలు తీరుపై ఆరా తీశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులే కీలకం. రహదారి ఉంటేనే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లకు ప్రజలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న రోడ్లను బలోపేతం చేసి దీర్ఘకాలికంగా నిర్వహించడమే లక్ష్యంగా హ్యామ్ విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. హ్యామ్ తొలి దశలో మొత్తం 7,448 కిలోమీటర్ల మేర 2,145 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రహదారి సౌకర్యం లేని 176 గ్రామ పంచాయతీలకు 934 కిలోమీటర్ల మేర కొత్త బీటీ రోడ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఉన్న బీటీ రోడ్లలో 5,490 కిలోమీటర్ల మేర బలోపేతం, మరమ్మతులు చేపట్టి ఆధునీకరించనున్నారు. అధిక రద్దీ ఉన్న 1,024 కిలోమీటర్ల సింగిల్ లేన్ బీటీ రోడ్లను ఇంటర్మీడియట్ లేన్లుగా విస్తరించనున్నారు. ఈ పనులతో తొలి దశలోనే 3,036 గ్రామ పంచాయతీలు లబ్ధి పొందనున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఆదివారం పైలాన్ ఆవిష్కరించి హ్యమ్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు.
Also read: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రహదారులను మొత్తం మూడు దశల్లో 18,472 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 7,448 కిలోమీటర్లు, రెండో దశలో 5,676 కిలోమీటర్లు, మూడో దశలో 5,348 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ కింద ఎంపిక చేసిన రహదారులు గ్రామ పంచాయతీలను మండల, జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధానితో అనుసంధానించేలా ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేశారు. రహదారి లేని గ్రామ పంచాయతీలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే బీటీ రహదారులు, మట్టి రోడ్లను అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఉన్న రహదారులను బలోపేతం చేయడం ద్వారా సమగ్ర గ్రామీణ రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యం.నిర్మాణ కాలం 30 నెలలు కాగా, ఆ తర్వాత 15 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థదే. నిర్మాణ వ్యయంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, మిగిలిన 60 శాతాన్ని కన్సెషనర్ భరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని 15 ఏళ్లలో 30 వాయిదాలుగా చెల్లిస్తుంది. దీంతో రహదారుల నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది.
తెలంగాణలో మొత్తం 69,318 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారుల నెట్వర్క్ ఉంది. ఇందులో 45 శాతం వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. మొదటి విడతలో రహదారి లేని గ్రామాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలకు గాను 12,426 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే రహదారి అనుసంధానం ఉంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు కూడా బీటీ రహదారి అనుసంధానం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో తొలి దశలోనే 176 గ్రామ పంచాయతీలను హ్యామ్ కింద అనుసంధానిస్తున్నారు. మిగిలిన 156 గ్రామాలకు ఇతర గ్రాంట్ల ద్వారా రహదారి సదుపాయం కల్పించనున్నారు. మార్చి 2027 లోపు రహదారి సదుపాయం లేని గ్రామం ఉండ కూడదన్న లక్ష్యంతో పనులను పూర్తి చేయనున్నారు.
గ్రామానికి రహదారి అంటే కేవలం ప్రయాణ సౌకర్యం కాదు. అది పల్లెను పాఠశాలతో, ఆసుపత్రితో, మార్కెట్తో, ఉపాధి అవకాశాలతో కలిపే అభివృద్ధి బాట. రహదారి లేని ఒక్క గ్రామం కూడా వెనుకబడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దేశంలోనే తొలిసారిగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి హ్యామ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నాం. దశలో రహదారి లేని 176 గ్రామ పంచాయతీలకు కొత్త బీటీ రోడ్లు వేయడంతో పాటు, వేల కిలోమీటర్ల రోడ్లను బలోపేతం చేస్తున్నాం. అధిక రద్దీ ఉన్న సింగిల్ లేన్ రోడ్లను విస్తరిస్తున్నాం. పల్లె ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మాప్రభుత్వ లక్ష్యం.
Also Read: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!