Hyderabad Murder: తండ్రి చావు ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ విషాదం హైదరాబాద్ చంపాపేట కుమ్మరిబస్తీలో జరిగింది. కుమ్మరిబస్తీ నివాసి ముదావత్ వెంకటేశ్ (28) ఆటోడ్రైవర్ గా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి చనిపోవటంతో వెంకటేశ్ తమ్ముడు శివ (26) చావు ఖర్చులను ఇద్దరం కలిసి భరిద్దాం అని చెప్పాడు.
అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని తరువాత ఇస్తానని శివ చెప్పటంతో వెంకటేశ్ అన్ని ఖర్చులు తానే పెట్టుకుని కర్మకాండ పూర్తి చేశాడు. అయితే శివ ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం మెుదలైంది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే శివ తన మకాంను కుమ్మరిబస్తీకి మార్చాడు.
Also Read: సాయం చేస్తానని వచ్చి.. రూ. 10 కోట్లు లేపేశాడు.. ఏకంగా 30 మందికి టోకరా!
కాగా, శనివారం కూడా చావు ఖర్చుల విషయమై అన్నదమ్ముల మధ్య మరోసారి గొడవ జరిగింది. మాటా మాటా పెరిగిపోవటంతో కోపంతో రెచ్చిపోయిన శివ కత్తెరతో వెంకటేశ్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే తుదిశ్వాస వదిలాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
Also Read: స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వదల్లేదుగా!