Hyderabad Fraud: అవసరానికి డబ్బు ఇచ్చి.. ఆస్తులు కాజేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ కిరణ్ తెలిపిన ప్రకారం.. కొండాపూర్ నివాసి నునావత్ యుగంధర్ (34) జనాన్ని మోసం చేయటమే వృత్తిగా చేసుకుని కాలం గడుపుతున్నాడు. కొంతకాలం క్రితం పరిచయం ఉన్న ఓ వ్యక్తికి అవసరం రావటంతో రూ. 60 లక్షల సాయం చేశాడు. బదులుగా సదరు వ్యక్తికి చెందిన ఆస్తి పత్రాలను తీసుకుని సేల్ డీడ్ రాయించుకున్నాడు. ఆస్తిని ఎవ్వరికీ అమ్మనని చెప్పి ఒప్పందం కూడా చేశాడు.
కొన్నిరోజులు గడిచిన తర్వాత సేల్ డీడ్ ను అడ్డం పెట్టుకుని ఆ ఆస్తిని మూడో వ్యక్తి పేరు మీదకు యుగంధర్ మార్చేశాడు. అనంతరం అదే ఆస్తిని తాకట్టు పెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి కోటిన్నర రూపాయల రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించటంతో ఆస్తికి అసలు యజమాని బిత్తరపోయాడు. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టి శనివారం నిందితుడైన నునావత్ యుగంధర్ ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు ఆస్తులపై రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పయి మందికి పైగా అమాయకులను మోసం చేసినట్లు తేలింది. వారి నుంచి రూ.10 కోట్లు కొల్లగొట్టినట్టుగా వెల్లడైంది. ఇప్పటికే నిందితునిపై 12 క్రిమినల్ కేసులు, 8 సివిల్ కేసులు నమోదై ఉన్నట్టు తేలింది.
Also Read: ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?
మరో నాలుగు కేసుల్లో నునావత్ యుగంధర్ వాంటెడ్ గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నిందితున్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామంటూ చెప్పే నకిలీ ఫైనాన్స్ కన్సల్టెన్సీలు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏసీపీ కిరణ్ సూచించారు. ఆస్తుల పత్రాలు అప్పగించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: దేశంలోనే అతిపెద్ద జిల్లా.. దీని ముందు రాష్ట్రాలూ దిగదుడుపే.. ఢిల్లీ కంటే 31 రెట్లు పెద్దది!