Property Fraud: స్వేచ్ఛ బ్యూరో: అవసరానికి డబ్బు సాయం చేస్తాడు.. హామీగా ఆస్తి పత్రాలు పెట్టుకుని నిలువునా ముంచేస్తాడు.. ఇలా ఇరవై మందికి పైగా టోకరా వేసి పదికోట్లు కొట్టేసిన కేటుగాడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందికి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తానని నిందితుడు బురిడీ కొట్టించినట్టుగా విచారణలో వెల్లడైంది. ఏసీపీ కిరణ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కొండాపూర్ నివాసి నునావత్ యుగంధర్ (34) జనాన్ని మోసం చేయటమే వృత్తిగా చేసుకుని కాలం గడుపుతున్నాడు. కొంతకాలం క్రితం పరిచయం ఉన్న ఓ వ్యక్తికి అవసరం రావటంతో 60లక్షల సాయం చేశాడు. బదులుగా సదరు వ్యక్తికి చెందిన ఆస్తి పత్రాలను తీసుకుని సేల్ డీడ్ రాయించుకున్నాడు. ఆస్తిని ఎవ్వరికీ అమ్మనని చెప్పి ఒప్పందం కూడా చేశాడు. కొన్నిరోజులు గడిచిన తరువాత సేల్ డీడ్ ను అడ్డం పెట్టుకుని ఆ ఆస్తిని మూడో వ్యక్తి పేర మార్చేశాడు. అనంతరం అదే ఆస్తిని తాకట్టు పెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి కోటిన్నర రూపాయల రుణం తీసుకున్నాడు.
Also read: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!
వాయిదాలు చెల్లించకుండా డీఫాల్ట్ అయ్యాడు. దాంతో బ్యాంక్ అధికారులు రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించటంతో ఆస్తికి అసలు యజమాని బిత్తరపోయాడు. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టి శనివారం నిందితుడైన నునావత్ యుగంధర్ ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు ఆస్తులపై రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పయి మందికి పైగా అమాయకులకు టోకరా వేసి 10కోట్లు కొల్లగొట్టినట్టుగా వెల్లడైంది.
ఇప్పటికే నిందితునిపై 12క్రిమినల్ కేసులు, 8సివిల్, ఎన్ఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదై ఉన్నట్టు తెలిసింది. మరో నాలుగు కేసుల్లో నునావత్ యుగంధర్ వాంటెడ్ గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. నిందితున్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామంటూ చెప్పే నకిలీ ఫైనాన్స్ కన్సల్టెన్సీలు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏసీపీ కిరణ్ చెప్పారు. ఆస్తుల పత్రాలు అప్పగించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
Also Read: ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?