Laxman Kumar: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్.. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి BRSలో చేరడంపై , గత ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
బహిరంగ సభనా? జాయినింగ్ సభనా?
ఎల్లుండి జరగబోయే సభపై మంత్రి సూటిగా స్పందించారు. ‘అది BRS బహిరంగ సభా లేక జీవన్ రెడ్డి జాయినింగ్ సభా అనేది కేటీఆర్, హరీష్ రావులు స్పష్టం చేయాలి’ అని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ధనంతో జన సమీకరణ చేస్తే దానిని జాయినింగ్ సభ అనరని, అది కేవలం పార్టీ ప్రోగ్రామ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
జీవన్ రెడ్డి తీరుపై ఆగ్రహం
40 ఏళ్లు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు పార్టీని వీడటం బాధాకరమని మంత్రి అన్నారు. నిన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్లను తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు వారే గొప్ప అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యసభ సీటో లేదా ప్రభుత్వ సలహాదారు పదవో ఇచ్చి ఉంటే.. జీవన్ రెడ్డి ఈరోజు ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ఒక ‘లిమిటెడ్ కంపెనీ’ అని సంబోధించడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకవచనంతో మాట్లాడటం పద్ధతి కాదని, తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు.
BRS వైఫల్యాల వల్లనే మార్పు
గత పదేళ్లలో BRS ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, నిరుద్యోగులను, రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేసిందని మంత్రి విమర్శించారు. ఒకవేళ BRS పాలన అంత బాగుంటే 2023లో ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేశారో జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కొండగట్టు బస్ ప్రమాదంలో 60 మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి రాని కేసీఆర్ నాయకత్వంలోకి వెళ్లడం విచారకరమన్నారు.
చివరగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. 2029లో కూడా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!