Hyderabad: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు కోటి ఉచిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ఇది తొలిసారని చెప్పుకొచ్చారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ మేరకు శాసనసభలో ఓ ప్రకటన చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి బీమా కవరేజ్ కోటి రూపాయల బీమా తీసుకొచ్చినట్టు తెలిపారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డు మీద పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
ప్రభుత్వంపైగానీ, ఉద్యోగులపై గానీ రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం కోసం మొత్తం 16 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి కోటి, ఇతర ప్రయోజనాలతో కలిపి కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు బీమా ఉంటుందన్నారు. సహజ మరణానికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం ఉందన్నారు. ఇప్పటివరకు 98 క్లెయిమ్లు పరిష్కారం అయినట్టు సభలో వెల్లడించారు.
సింగరేణిలో వచ్చిన 50 క్లెయిమ్లూ పరిష్కారం అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 33 క్లెయిమ్లకు 24 పరిష్కారం అయ్యాయని తెలిపారు. తొలుత సింగరేణి ఉద్యోగులతో బీమా పథకానికి శ్రీకారం చుట్టామని, 2025లో ఇంధన శాఖ ఉద్యోగులకు విస్తరించామన్నారు. ఈ ఏడాది జూన్ 25 నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందని, దీనికి సంబంధించి గతేడాది జూన్ 26న ఆర్థిక శాఖ 77వ జీవో జారీ చేసిందన్నారు.
తెలంగాణ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసిందని, ఇతర రాష్ట్రాలు తెలంగాణ బీమా విధానంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్కార్డులు తీసుకొచ్చామని, దశాబ్దాల ఉద్యోగుల డిమాండ్కు ఫుల్ స్టాప్ పెట్టామన్నారు. హెల్త్కార్డుతో క్యాష్లెస్ ట్రీట్మెంట్, CGHS ప్యాకేజీ సదుపాయాల కోసం ఈ పథకానికి రూ.240 కోట్ల నిధులు కేటాయించినట్టు వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి బీమా, ఆరోగ్య భద్రతకు హెల్త్ కార్డు ఉన్నాయని ఆయా కుటుంబాలకు ఆర్థిక, వైద్య భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ALSO READ: శామీర్పేట్లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!