Reservations GO: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. రిజర్వేషన్లకు సంబమంధించి జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం సర్పంచ్, వార్డు స్థానాల్లో బీసీలకు 23 శాతం సీట్లు దక్కనున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ రిపోర్టును సమర్పించింది. అందులో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలని సూచించింది. ఈ కమిషన్ సిఫార్సులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మంత్రుల దగ్గర కూడా ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారు. పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్డీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోకు అనుగుణంగా వార్డులకు MPDOలు, RDOలు సర్పంచి పదవులకు రిజర్వేష్లను ఖరారు చేస్తారు.
అటు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు స్థానాలు కేటాయించనున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామని.. దీనికి సంబంధించిన పిటిషన్పై విచారణను ముగించాలని నవంబర్ 24న ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలపనున్నాయి. హైకోర్టు నిర్ణయం అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది.