LPG Shortage: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల గృహా వినియోగదారులు, హాస్టళ్ళు, హోటలలో వంట పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్తో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడి కష్టాలు పెరిగాయి. ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్యాస్ బుక్ చేసుకున్న రెండు రోజులలో వినియోగదారు ఇంటికి వాహనంలో డోర్ డెలివరీ చేసేవారు. ప్రస్తుతం ఆ సదుపాయాన్ని నిలిపివేశారు. 20 రోజుల క్రితం బుక్ చేయగా ఓటీపీలు వచ్చినా డోర్ డెలివరీ చేయకపోవడంతో ప్రస్తుతం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఏజెన్సీ నిర్వాహకులను అడగగా మరోసారి కాలవ్యవధి ముగిసిన తర్వాత బుక్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు రెండు నుంచి మూడు నెలలకు ఒక సిలిండర్ బుక్ చేసుకునే గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఇప్పుడు అవసరానికి బుక్ చేసుకుందామన్న ఓటిపి రాక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
20 రోజుల క్రితం గ్యాస్ కోసం బుక్ చేసుకున్న వారికి సైతం ఓటీపీలు వచ్చిన ఇంటికి సరఫరా చేయకపోవడంతో వినియోగదారులు గ్యాస్ కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుకింగ్ చేసుకునేందుకు 45 రోజుల వ్యవధి నిర్ణయించడంతో ఇప్పటికే సిలిండర్ అయిపోయి మరొకటి రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న 45 రోజుల వరకు ఆగాల్సిందేనని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సూచిస్తున్నారు. వాస్తవానికి వాణిజ్య సిలిండర్ల సరఫరా ప్రస్తుతానికి నిలిచిపోయింది గృహ వినియోగదారుల సిలిండర్ల సరఫరా యధాతథంగా కొనసాగుతోంది. మరి ముఖ్యంగా కేవలం ఒక సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా డబల్ సిలిండర్లు ఉన్న ప్రజలకు ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేక సజావుగా సాగుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో కొందరు సిలిండర్ కోసం బుక్ చేశామని అయినా రాలేదని గ్యాస్ ఏజెన్సీ ల దగ్గరికి వచ్చి వాకబు చేస్తున్నారు. బుకింగ్ చేశామని కచ్చితంగా సిలిండర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతానికి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో డోర్ డెలివరీ చేసే పరిస్థితి లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సిలిండర్ కోసం బుక్ చేసినప్పుడు ఓటిపి వస్తుంది. ఈ ఓటీపీని ఆన్లైన్ లో నమోదు చేసి సిలిండర్ లను సరఫరా చేస్తున్నారు. కొందరు కాలవ్యవధి ముగియకముందే సిలిండర్ బుక్ చేసుకుంటుండగా వారికి కావాల్సిన గడువును మెసేజ్ రూపంలో సూచిస్తుంది.చాలామంది వినియోగదారులకు సమయం ఉండడంతో ఓటీపీలు రావడం లేదు. అలాంటి కారణాలతో సిలిండర్ల డెలివరీలో జాప్యం జరుగుతోంది.
క్యూ లైన్లో ఖాళీ సిలిండర్లు పెట్టి జనాలు ఎదురుచూస్తున్నారు. కస్టమర్లు మిడిల్ ఈస్ట్ యుద్ధ కారణంగా మనదేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండర్ కొరకు గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు పట్టణ ప్రాంతాలలో 25 రోజులకు బుకింగ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించడంతో కొంతమంది తెలియక ఖాళీ సిలిండర్ తీసుకొని గ్యాస్ గోదాంకు వస్తున్నారు. దీంతో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ సిలిండర్ వస్తుందా రాదా? వంట చేస్తామా లేదా కట్టెల పొయ్యే మాకు దిక్కా అంటూ ప్రజలు అవసర పడాల్సిన పరిస్థితి ఎదురయింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో 11 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించి 1,76,366 , వాణిజ్య అవసరాలకు సంబంధించి 907 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 2815 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్ లు జరుగుతున్నాయి. జిల్లాకు రోజుకు సుమారు 5000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, గ్యాస్ కొరత లేదని కలెక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు.. ప్రజలు భవిష్యత్తులో గ్యాస్ కొరత రావచ్చేమోనని అనుమానాలతో ముందుగానే బుక్ చేసుకోవడం వలన ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరాల్సి వస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు అపోహలను వీడి అనవసరంగా భయపడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలోనే గ్యాస్ సిలిండర్ ల కోసం బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో హోటళ్లు ఉన్నాయి. రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వీధుల్లో బజ్జి టిఫిన్ సెంటర్లు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలామంది నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను కంపెనీలు నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కెందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ హోటల్ నిర్వహణ సాగిస్తున్నారు.
Also Read: Iran War: ఇరాన్ వినాశనం ఖాయం.. నాయకత్వం కుప్పకూలింది.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు