Anganwadi Food Poisoning: పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం చిన్నారుల పాలిట మృత్యు కేంద్రంగా మారింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకాల గడ్డతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఆహారం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
తండాకు చెందిన భూక్యా సురేశ్, నీలమ్మ దంపతుల కుమార్తె నిత్య (4), మరో చిన్నారి చైత్ర గత నెల 14న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయమ్మ పెట్టిన వడియాలు తిన్న కాసేపటికే ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చైత్ర గత నెల 29న మృతి చెందగా.. దాదాపు నెల రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ నిత్య గురువారం (డిసెంబర్ 19) కన్నుమూసింది. వీరితో పాటే ఆహారం తీసుకున్న కీర్తి, భువనేశ్వరి అనే మరో ఇద్దరు పిల్లలు కూడా అస్వస్థతకు గురయ్యారు, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.
అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉంచిన తినుబండారాలపై ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, కలుషిత ఆహారం (ఫుడ్ పాయిజన్) వల్లే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, జిల్లా అధికారి సబితా మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. చిన్నారులు గతం నుంచే అనారోగ్యంతో ఉన్నారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనల నేపథ్యంలో గత 20 రోజులుగా అంగన్వాడీ కేంద్రం మూతపడింది. తమ పిల్లల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మృతుల బంధువుల ఆందోళన బాటపట్టారు.
Read Also: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్