Mahabubnagar: స్వేచ్ఛ బ్యూరో: వేసవి సెలవులను సార్థకం చేసుకునేలా విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 22వ తేదీ వరకు మహబూబ్నగర్ పట్టణంలోని రెయిన్బో స్కూల్, క్రిస్టియన్ కాలనీలో ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ప్రతిభ, బెక్కెం జనార్ధన్ మీడియాకు వెల్లడించారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు. 8 సంవత్సరాల పైబడిన బాల బాలికలకు 20 రోజులపాటు డాన్స్ (వెస్ట్రన్, క్లాసిక్), చిత్రలేఖనంలో శిక్షణ అందించనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
చిత్రలేఖనానికి అవసరమైన సామగ్రిని నిర్వాహకులే అందిస్తారని, శిక్షణ అనంతరం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజుగా కేవలం రూ.100 మాత్రమే నిర్ణయించామని వెల్లడించారు.
బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు బెక్కెం జనార్ధన్ మాట్లాడుతూ.. పిల్లలు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లేందుకు ఈ శిక్షణ ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పంపించాలని పిలుపునిచ్చారు.
శిక్షణలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 93983 05993 నంబరును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!