Mahesh Kumar Goud: కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై.. బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలేమిటో వివరించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో.. ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ 12 ఏళ్ల పాలనలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడం విడ్డూరమని.. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదు. తెలంగాణపై అడుగడుగున కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నా, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైన వ్యక్తి కిషన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదు అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పక్షపాతం చూపుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి కీలక ప్రాజెక్టుల వరకు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో.. మోదీ ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది అని స్పష్టం చేశారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా, కిషన్ రెడ్డి మౌనంగా ఉండటం దురదృష్టకరం అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. రైతులు, మహిళలు, పేదలు, యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు.
ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయాలు ప్రజల మద్దతును స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఎవరి పాలనకు మద్దతు ఇస్తున్నారో ఈ ఫలితాలే చెబుతున్నాయి అని వ్యాఖ్యానించారు.
Also Read: కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలం.. ఎంపీ రఘునందన్ రావు విమర్శలు
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎండగడుతూ, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీజేపీ పాలన వైఫల్యాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుంచుతామని ఆయన స్పష్టంగా చెప్పారు.