Maoist Barse Deva: దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న భద్రతా బలగాలకు తెలంగాణలో భారీ విజయం దక్కింది. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ దండకారణ్యంలో సాయుధ పోరాటాన్ని నడిపిస్తున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్ బర్సీదేవా (Barse Deva) పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవడం సంచలనం సృష్టిస్తోంది.
బర్సే దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. కరుడుగట్టిన మావోయిస్టు నేత హిడ్మా (Hidma) ఎన్కౌంటర్/నిష్క్రమణ తర్వాత పార్టీ మిలిటరీ వ్యవహారాల్లో దేవానే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. విశేషమేమిటంటే.. హిడ్మా మరియు బర్సే దేవా ఇద్దరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒకే గ్రామానికి చెందినవారు. చిన్ననాటి నుంచి కలిసి పనిచేయడంతో హిడ్మాకు అత్యంత నమ్మకస్తుడిగా దేవా పేరు తెచ్చుకున్నారు.
కేవలం వ్యూహాలు రచించడమే కాకుండా, మావోయిస్టు సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడంలో బర్సే దేవా కీలక పాత్ర పోషించారు. పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలన్నీ ఇతని కనుసన్నల్లోనే నడిచేవి. అలాంటి వ్యక్తి లొంగిపోవడంతో మావోయిస్టుల నెట్వర్క్ బలహీనపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారు.. హరీష్ రావు ఫైర్