Maoist Surrender: దశాబ్దాల సాయుధ పోరాట చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నలుగురు అగ్రనేతలు సహా మొత్తం 40 మంది మావోయిస్టులు మంగళవారం డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు నేతలను ఆయన అభినందించారు. లొంగిపోయిన వారిలో పొలిట్బ్యూరో సభ్యుడు సెంట్రల్ కమిటీ ఇన్ఛార్జి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కీలకమైన వ్యక్తి. ఇతనితో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్.. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ జగన్.. రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగ్న పోలీస్ బాసు ముందు తమ ఆయుధాలను వదిలేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రస్తుతం పూర్తిగా పతనమైందని ప్రకటించారు. తెలంగాణలో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఇక్కడే ఆఖరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. తిప్పిరి తిరుపతి కోరుట్లలో విద్యనభ్యసించి కరీంనగర్ ఆర్ఎస్యూ కార్యకలాపాల ద్వారా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. 1978లో జగిత్యాల జైత్రయాత్ర ద్వారా ఉద్యమ బాట పట్టి.. 1982లో పీపుల్స్వార్లో చేరి కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో ఒకే ఒక్క క్రియాశీల సభ్యుడు మిగిలి ఉన్నారని.. నెట్వర్క్ పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు వివరించారు. పార్టీలో అంతర్గత విభేదాలు.. అవిశ్వాసం.. నాయకత్వ స్థాయిలోని గొడవలు తీవ్రరూపం దాల్చడం వల్లే నేతలు బయటకు వచ్చారని తెలిపారు. కేడర్లో సిద్ధాంతపరమైన అసంతృప్తి పెరిగిపోయిందని.. మావోయిస్టులకు లభించే ప్రజా మద్దతు క్షిణించిందని డీజీపీ పేర్కొన్నారు.
లొంగిపోయిన కీలక నేతలపై ప్రభుత్వం భారీ రివార్డులను ప్రకటించింది. తిప్పిరి తిరుపతిపై రూ.25 లక్షలు.. మల్ల రాజిరెడ్డిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. బడే చొక్కారావు.. నూనె నర్సింహారెడ్డిలపై రూ.20 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస సదుపాయాలు కల్పిస్తామని పోలీసులు తెలిపారు. మావోయిస్టు మాజీ అగ్రనేత గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని.. బయట షెల్టర్లో ఉన్నట్లు సమాచారం ఉందని డీజీపీ వెల్లడించారు. అలాగే సుదర్శన్ ఒడిశాలో ఉన్నట్లు తమకు తెలుస్తోందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మరో 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని.. వారంతా ‘పోరు వద్దు-ఊరు ముద్దు’ అనే పిలుపును అందుకుని జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. సాయుధ పోరాట మార్గాన్ని వదిలి శాంతియుత జీవితం గడపాలని ఆకాంక్షించారు.