మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయనందుకే ఈ శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన భూ హక్కుల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సంబంధిత భూ వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. వివాదంలో ఉన్న ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి చట్టప్రకారం సమస్యను తేల్చాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ అమలు చేయలేదు. గడువు ముగిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు మరోసారి కోర్టు మెట్లెక్కారు. కలెక్టర్ తీరుపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్ కలెక్టర్ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కించపరచడమేనని అభిప్రాయపడ్డారు. ఉన్నత స్థాయి అధికారి అయ్యుండి న్యాయస్థాన ఉత్తర్వులను తుంగలో తొక్కడం సరికాదని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించిన కారణంగానే జైలు శిక్ష జరిమానా విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. శిక్ష విధిస్తూనే మరో వెసులుబాటు కూడా కల్పించింది. ఈ తీర్పుపై కలెక్టర్ పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
ALSO READ: Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్