తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తజన సంద్రమై కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల దర్శనం కోసం తరలివస్తుండగా… మేడారంలోని ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా సమ్మక్క తల్లి కొలువై ఉన్నట్లు భావించే చిలకల గుట్ట వద్ద నెలకొన్న దృశ్యాలు భక్తుల అచంచల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ జాలువారే ‘సమ్మక్క జలధార’ భక్తులకు అత్యంత ప్రత్యేకం.
పురాణ గాథల ప్రకారం.. యుద్ధం ముగిసిన తర్వాత సమ్మక్క తల్లి చిలకల గుట్టలోకి వెళ్లి మాయమైందని, అక్కడ కుంకుమ భరణి రూపంలో వెలిసిందని భక్తుల నమ్మకం. ఈ గుట్ట నుంచి ఏడాది పొడవునా జలధారలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ నీటిని భక్తులు కేవలం నీరుగా కాకుండా.. సమ్మక్క తల్లి స్వయంగా ప్రసాదిస్తున్న పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. ఈ జలధార కింద స్నానం చేసినా లేదా తలపై చల్లుకున్నా పుణ్యం లభిస్తుందని, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతుండటంతో ఆ నీటిని పట్టుకోవడానికి జనం ఎగబడుతున్నారు.
ఈ జలధార చిలకల గుట్టలోని దట్టమైన అడవిలో అనేక ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ వస్తుంది. అందుకే ఈ నీటికి ప్రకృతిసిద్ధమైన ఔషధ గుణాలు ఉన్నాయని, వీటిని తాగడం వల్ల శరీరంలోని రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాతరకు వచ్చే వారు ఈ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు. కుటుంబ సభ్యులందరికీ దీనిని ప్రసాదంగా అందించి, తమ ఇంటిని ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటారు.
చిలకల గుట్ట వద్ద ఒక భక్తురాలు వనదేవతల పూనకంతో చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ‘నరుడు కొత్త కొత్త రోగాలు కనిపెట్టి లోకాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. కానీ, నేను సృష్టించిన ఈ ప్రకృతి సిద్ధమైన మందులతోనే జనం బతుకుతున్నారు. ఈ గుట్టలోని జలధారలో స్నానం చేస్తే కోటి రోగాలనైనా నయం చేస్తాను’ అంటూ సమ్మక్క తల్లి ఆవేదనను, ఆశీస్సులను వినిపించిన తీరు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. తాను పచ్చి రక్తం తాగే దేవతను.. కుంకుమ భరణిగా శాంత రూపంతో లోకాన్ని రక్షించడానికి వచ్చానని ఆ తల్లి సందేశం ఇచ్చింది.
నేడు సాయంత్రం సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి గద్దెకు చేరుకోనుంది. ఈ తరుణంలో పవిత్ర గంగగా పిలువబడే ఈ జలధారను స్వీకరించేందుకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. సకల దోషాలను హరించి, రోగాలను నయం చేసే దివ్య ఔషధంగా ఈ జలధారను భావిస్తూ.. ‘జై సమ్మక్క.. జై జై సమ్మక్క’ అంటూ మేడారం అడవి మారుమోగిపోతోంది.