Medchal News: మేడ్చల్ స్వేచ్ఛబ్యూరో : అల్వాల్ పోలీస్ స్టేషన్లో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి మేడ్చల్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2024లో ఒక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక గర్ల్స్ వాష్రూమ్కు వెళ్లిన సమయంలో అక్కడ పెయింటింగ్ పనులు చేస్తున్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తన టీచర్కు విషయం తెలిపింది. టీచర్ సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Crime News: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?
దర్యాప్తులో నిందితుడు అల్వాల్కు చెందిన ఆర్.జె. నారాయణ (47)గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. కేసును విచారించిన మేడ్చల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. వెంకటేష్ నిందితుడిని దోషిగా తేల్చి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదనంగా బాధిత బాలికకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.ఈ కేసులో అల్వాల్ సీఐ ప్రశాంత్ సహకారంతో భరోసా లీగల్ కౌన్సిలర్లు రోజా, అఖిల బాధితురాలికి న్యాయ సహాయం అందించినట్లు ప్రభుత్వ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
Also Read: Gautam Gambhir: హనుమంతుడి గుడిలో కాకుండా మసీదులో టైటిల్ పెట్టాలా ? గంభీర్ సీరియస్