Bhatti Vikramarka :
⦿ రెండు మెగావాట్ల వరకు అనుమతులు
⦿ కొనుగోలు చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్ – ఏ పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం – కుసుమ్) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములపై ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చు. ఈ సందర్భంలో భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్ల ద్వారా ఒప్పందం మేరకు లీజు మొత్తం అందించబడుతుందని తెలిపారు.
Also Read : ఇందిరమ్మ ఇళ్లు వీరికే ముందు.. మున్నేరు బాధితులకు మంత్రి గుడ్ న్యూస్.. ఖమ్మానికి వరాల జల్లు
రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు, వాటర్ యూజర్ అసోసియేషన్లు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు అని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం దరఖాస్తులు టీజీఆర్ఈడీసీవో ద్వారా ఆన్ లైన్లో సమర్పించాలని, లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్ను ఎంపిక చేసుకొని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ.3.13/కిలో వాట్ గంట(కేడబ్ల్యూహెచ్) ధర వద్ద 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క.