Telangana RTC: హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో ప్రయాణికులు, సిబ్బంది సౌకర్యార్థం నూతనంగా చేపట్టనున్న సీసీ (CC) పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో డిపో ఆవరణలో నీరు నిలిచిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను డిపో మేనేజర్, సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి ఈ పనులకు నిధులు మంజూరు చేయించారు.
హుస్నాబాద్ బస్ స్టేషన్ను అన్ని రకాల హంగులతో అభివృద్ధి చేశామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యమని.. ఇంకా ఎక్కడైనా కొత్త రూట్లు అవసరమైతే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) ద్వారా ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ, నేడు లాభాల దిశగా పయనిస్తోందని మంత్రి వివరించారు. ఈ పథకం ద్వారా సంస్థకు ఆదరణ పెరగడమే కాకుండా, సామాన్య ప్రజలకు రవాణా వ్యవస్థ మరింత చేరువయిందని అన్నారు.
తెలంగాణ ఆర్టీసీ సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 341 బస్ స్టేషన్లు, 97 డిపోలు ఉన్నాయి. ప్రతిరోజూ 10 వేల బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని, మరో రెండు కొత్త డిపోలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే కాకుండా, ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.
ALSO READ: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్