Minister Seethakka: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. గాంధీ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు నుంచి ‘గాంధీ’ పేరును తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి, బీజేపీ ఆయనను మరోసారి హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వలసలు తగ్గించి, వెట్టి చాకిరి నుంచి పేదలకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ తెచ్చిన ఈ చట్టానికి బీజేపీ ఉరి వేస్తోందని సీతక్క మండిపడ్డారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల మైనింగ్ తవ్వకాలకు చౌకగా కూలీలను సరఫరా చేసేందుకే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో పని దొరక్కపోతే కూలీలు తక్కువ రేటుకే కార్పొరేట్ల దగ్గర వెట్టి చాకిరి చేయాల్సి వస్తుందని, ఆ దుర్మార్గపు ఆలోచనతోనే కేంద్రం పనిదినాలను తగ్గిస్తోందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానానికి వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు చేసి పంపిస్తామని, ఈ నెల 27 లేదా 28 తేదీల్లో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లతో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉపాధి హక్కును భిక్షగా కాకుండా హక్కుగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై సీతక్క సెటైర్లు వేశారు. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతోనే ఫుట్బాల్ ఆడారని, ఇక కేటీఆర్తో ఎలా ఆడాలో ఆయనకు బాగా తెలుసునని కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయిందన్న అక్కసుతోనే హరీష్ రావు మాట్లాడుతున్నారని, తప్పుడు కూతలు, గ్లోబల్ ప్రచారంలో హరీష్ రావును మించిన వారు లేరని విమర్శించారు. పదేళ్లు అధికారమిస్తే ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ఇంట్లో ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే తాము కూడా ఫుట్బాల్ ఆడుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది, నేడు బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, గ్రామ ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేలా పనిచేయాలని హితవు పలికారు. గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, పల్లె ప్రగతికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also: Jangaon: అంబులెన్స్ బెడ్పై నుంచే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం.. జనగామ జిల్లాలో ఘటన