Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల.. పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట సమీపంలో 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్లతో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి రెండో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక కాలనీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2011లో ఈ ప్రాజెక్టును ప్రారంభించానని.. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 2014 నాటికే పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి చేపట్టిన వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేయించి.. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించినట్లు వివరించారు. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగిలిన స్వల్ప పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా.. కేవలం స్థానిక అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఉంటాయని ఆయన సుస్పష్టం చేశారు.
ఈ మోడల్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాల విషయంలో ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి వివరించారు. 317 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రతి ఇంట్లో సింగిల్ బెడ్ రూమ్.. విశాలమైన వంటగది.. బాత్రూం సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. 24 గంటల సురక్షిత నీటి సరఫరా.. విద్యుదీకరణ.. ఆధునిక పాఠశాల.. పార్క్.. కమ్యూనిటీ సెంటర్ వంటి వసతులు కల్పించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆర్డీఓ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి దశలో 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం ఆహార భద్రతకు.. సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 3,500 ఇళ్లతో కలిపి మొత్తం 5,660 మంది నిరుపేదలకు గృహ వసతి లభించనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం రోజున లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి తాను సహపంక్తి భోజనం చేస్తానని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు.. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.