HCU : నెమళ్లు, జింకలు ఉన్నాయా? ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ ఫోటోలు, వీడియోలు ఎవరు వదులుతున్నారు? ఫాల్స్ ప్రచారం వెనుక ఉన్నది ఎవరు? సెంట్రల్ వర్సిటీ స్టూడెంట్స్ వాదనలో నిజమెంత? విద్యార్థులను వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? కంచ గచ్చిబౌలి భూములపై ఎలా ముందుకు వెళ్లాలి? కోర్టులో కేసులపై ఎలాంటి వైఖరి అవలంభించాలి? 400 ఎకరాలపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలా అనేక అంశాలపై మంత్రుల కమిటీ కీలక సమావేశం నిర్వహించింది.
స్టూడెంట్స్ JAC డుమ్మా..
మంత్రుల కమిటీతో HCU ఉపాధ్యాయ సంఘం, ప్రజాసంఘాల ప్రతినిధుల భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు మంత్రులు భట్టి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, వంశీచంద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే, తమ డిమాండ్లను నెరవేర్చలేదంటూ స్టూడెంట్స్ JAC మాత్రం ఈ భేటీకి రాలేదు.
పౌర సంఘాల డిమాండ్లు ఇవే..
ఆ 400 ఎకరాల్లో జీవవైవిధ్య సర్వే నిర్వహించాలని.. చెట్లు కొట్టివేత వల్ల జరిగిన నష్టం అంచనా వేయాలని పౌరసంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఆ ల్యాండ్లో నిషేధాజ్ఞలు తొలగించాలని, క్యాంపస్ నుంచి పోలీసులను ఉపసంహరించాలని రిక్వెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న స్టూడెంట్స్ను రిలీజ్ చేయాలని.. వారిపై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి.
స్టూడెంట్స్కు రిలీఫ్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు HCU విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.
నో.. అందుకు ఒప్పుకోం..
ఆ 400 ఎకరాల్లో పోలీస్ బందోబస్తును తొలగించడానికి మాత్రం మంత్రుల కమిటీ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోలీస్ పహారా కొనసాగుతోందని చెప్పారు. అయితే, క్యాంపస్ నుంచి పోలీసులను వెనక్కి తీసుకునే ప్రక్రియపై యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే క్యాంపస్లో మంత్రుల కమిటీ పర్యటిస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఇక, కోర్టు ఆదేశాల కారణంగా జీవవైవిధ్య సర్వేకు అనుమతి ఇవ్వలేమని మంత్రులు తేల్చి చెప్పారు.
Also Read : అద్దంకి భార్య భావోద్వేగం
బండి సంజయ్ ఇంట్లో నెమళ్లు?
మరోవైపు.. HCU వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 400 ఎకరాల్లో జింకలు, నెమళ్లు ఉన్నాయనేది అవాస్తవం అన్నారు. నెమళ్లు ఎక్కడైనా ఉండొచ్చని.. ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా నెమలులు ఉన్నాయని.. వాటి సంగతి కూడా తెలుస్తామని చెప్పడం కలకలం రేపుతోంది. అటు.. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపైనా మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో రివ్యూ చేశారనే ప్రచారం అబద్దమని అన్నారు. సచివాలయంలో కూర్చునే అధికారం అందరికీ ఉందని చెప్పారు. ఆ రివ్యూకు మీనాక్షి తనను రావొద్దని అన్నారంటూ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. అది కూడా కరెక్ట్ కాదని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్.