Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారుల మధ్య తలెత్తిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీణవంక మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసుల పట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. దీనిపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించగా, తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. ఆవేశంలో అన్న మాటలే తప్ప, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయాలని తాను అలా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
జనవరి 29న వీణవంకలో జరిగిన జాతరకు వెళ్తున్న క్రమంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, ఆ సమయంలో జరిగిన ఒత్తిడి మరియు ఫ్రస్ట్రేషన్ లో తెలియకుండా నోరు జారానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు పోలీసు వ్యవస్థ అన్నా, అధికారులన్నా ఎంతో గౌరవం ఉందని, అయితే కొందరు అధికారులు కావాలనే తనను ఇబ్బంది పెట్టడంతోనే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసులపై అసభ్య వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి యేదుల పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అక్కడ లేని కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి మతపరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ఎమ్మెల్యే కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని, ఇది పోలీసుల మనోబలాన్ని దెబ్బతీసే చర్య అని వారు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసు సంఘం, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం ప్రజాప్రతినిధులకు తగదని హితవు పలికింది. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినప్పటికీ, మతపరమైన ప్రస్తావనలు తేవడంపై పోలీసు వర్గాల్లో ఇంకా అసహనం కొనసాగుతోంది. ఈ పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.
*ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు*
*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటన*
*రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు*
*పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం*
*కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో… pic.twitter.com/XFwZayMw4H
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2026
Read Also: విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు.. ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు!