ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ, దక్షిణ భారత కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. జాతరలో కీలక ఘట్టాలు ముగిసినప్పటికీ, భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మేడారం గడ్డకు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి.
వీఐపీల తాకిడి
సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా అమ్మవార్ల చెంతకు చేరుకుంటున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోవడంతో అధికారులు వీఐపీల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద ఎటువంటి తొక్కిసలాట జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ సందర్శన
ఈ ఏడాది మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్. ఆయన తన బృందంతో కలిసి మేడారం సందర్శించారు. అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా ఆయన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం అద్భుతం: గ్యారెత్ ప్రశంసలు
దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన గ్యారెత్ విన్ ఓవెన్, మేడారం జాతర విశిష్టతను కొనియాడారు. ‘మేడారం ఆలయం, ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి భారీ సంఖ్యలో భక్తులు ఒకే చోట చేరి ప్రకృతి దేవతలను పూజించడం చూడటం కొత్త అనుభూతిని ఇచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, పండుగలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన వెల్లడించారు. భక్తిభావంతో సాగే ఇలాంటి గొప్ప పండుగలను ప్రతి ఒక్కరూ దర్శించాలని, ఇక్కడి సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని ఆయన అన్నారు.
అమ్మవార్లకు భక్తులు ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెల వద్ద తన్మయత్వంతో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, తాగునీరు, పారిశుధ్యం విషయంలో యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ALSO READ: Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు