Raja Singh: వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నంపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో జరిగిన ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శివాజీ మహారాజ్ విగ్రహంపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
రాయపర్తిలో గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా, వందలాది మంది హిందూ కార్యకర్తల సమక్షంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎంతో ఘనంగా ఆవిష్కరించారని రాజాసింగ్ గుర్తుచేశారు. ఎంతో ఠీవిగా కూర్చున్న ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక, నిన్న రాత్రి కొంతమంది దుండగులు దాన్ని తగులబెట్టేందుకు (Fire/Arson attempt) ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు శివాజీ విగ్రహం చూసి ఎవరికి కోపం వస్తోందని, ఇలాంటి నీచమైన పనికి ఎందుకు ఒడిగట్టారని ఆయన ప్రశ్నించారు.
“ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఈ రోజు హిందూ సమాజం ఉండేదా? మనమంతా ఉండేవాళ్ళమా?” అని రాజాసింగ్ ప్రశ్నించారు. శివాజీ హిందువులందరికీ ఒక ఆరాధ్య దైవమని, అటువంటి మహనీయుడి విగ్రహాన్ని అవమానించడం దురదృష్టకరమని అన్నారు. ఇది కేవలం విగ్రహంపై దాడి కాదని, హిందువుల ఆత్మగౌరవంపై దాడి అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై రాజాసింగ్ పోలీసులకు గట్టి విజ్ఞప్తి చేశారు. శివాజీ విగ్రహాన్ని అవమానించిన దుర్మార్గులు ఎక్కడున్నా సరే వెంటనే గాలించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కోరారు. అలాగే స్థానిక హిందూ కార్యకర్తలు, గ్రామ, మండల అధికారులందరూ అప్రమత్తంగా ఉండి, నిందితుల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని హెచ్చరించారు.
Read Also: శివలింగం ధ్వంసం ఘటనలో.. బయటపడ్డ CCTV ఫొటోస్