BRS – BJP : కవిత మాటలు కాక రేపుతున్నాయి. ఇన్నాళ్లూ ఒట్టి ప్రచారమే అనుకున్నారు. కానీ, అది 101 శాతం నిజమని కేసీఆర్ కూతురే తేల్చి చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందన్నారామె. ఆ ప్రతిపాదన తన దగ్గర కూడా తీసుకొచ్చారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు తనతో ఆ మాట అన్నారని.. అయితే, అందుకు తాను అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఎన్నాళ్లైనా జైల్లో ఉంటా కానీ, బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేసేందుకు ఒప్పుకోనని స్పష్టం చేశానట్టు తెలిపారు. తాను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు కాబట్టే.. BRSను BJPలో విలీనం చేసేందుకే KCR నుంచి తనను దూరం చేస్తున్నారని కవిత చెప్పడం కలకలం రేపుతోంది. మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ లీడర్ రాజాసింగ్ సైతం కవిత మాటలు నిజమేనంటూ మరింత సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం పొలిటికల్ హీట్ అమాంతం పెంచేసింది.
విలీనం నిజమేనా?
నిజమేనా? బీజేపీలో బీఆర్ఎస్లో విలీనానికి ప్రయత్నం జరిగిందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య తెర వెనుక సంబంధాలపై మొదటి నుంచీ కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు కేసీఆర్ను కట్టడి చేసేందుకు.. లిక్కర్ కేసులో కవితను జైల్లో పెట్టారని అన్నారు. కూతురును విడిపించుకోవడానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన పెట్టారని ప్రచారం జరిగింది. కవిత సైతం తాను జైల్లో ఉన్నప్పుడు ఆ టాపిక్పై తనతో చర్చించారని చెప్పారు. అంటే, కవితను జైల్లో కలిసింది కేటీఆర్, హరీశ్రావులు మాత్రమే. వాళ్లిద్దరే కవిత కోసం పార్టీని బీజేపీకి తాకట్టుపెట్టే ప్రయత్నం చేశారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మరీ, విలీనం కాకపోయినా పూర్తిగా బీజేపీకి సహకరించేలా డీల్ కుదిరిందా? ఆ డీల్ మేరకే కవితకు బెయిల్ వచ్చిందా? ఇలా అనేక డౌట్స్ వినిపిస్తున్నాయి.
కేటీఆర్ ప్లానేనా?
కవితనే వ్యతిరేకిస్తుంటే.. మరి, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలనే ఐడియా ఎవరిది? కేసీఆర్దా? కేటీఆర్దా? మరోవైపు, తనకు నీతులు చెప్పే వారికి.. పార్టీని నడిపే సత్తా లేదని కవిత కామెంట్ చేశారు. ఆ మాటలను బట్టి చూస్తే.. కేటీఆరే పార్టీని బేరం పెట్టారా? అనే అనుమానం కలుగుతోందని అంటున్నారు. “కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని.. కేసీఆర్ను నడిపించేంత పెద్ద వాళ్లా మీరు?” అంటూ కవిత పరోక్షంగా అన్నకు కౌంటర్ కూడా ఇచ్చారు. లిక్కర్ స్కాంలో తన పేరు వచ్చినప్పుడే రాజీనామా చేస్తా అన్నానని.. కేసీఆర్ వద్దని వారించారని చెప్పుకొచ్చారు కవిత.
కాంగ్రెస్, బీజేపీలతో టచ్లో..
తాను అసలే మంచిదాన్ని కాదని.. తాను నోరు తెరిస్తే బాగోదంటూనే.. పెద్ద బాంబే పేల్చారు కవిత. బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు బీజేపీతో.. మరికొంత మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. తాను రాసిన లేఖలో తప్పేమీ లేదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కానీ, విలీనం కానీ పక్కా అని తేల్చిచెప్పారు.
నిజమే.. రాజాసింగ్ సంచలనం
కవిత కామెంట్స్ కాక రేపుతుంటే.. బీజేపీ ఫైర్బ్రాండ్ లీడర్, ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత అగ్గి రగిలించారు. కవిత మాట్లాడిన మాటలు నిజమేనని తాను అనుకుంటున్నానని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే.. బీజేపీ నేతలు సైతం బీఆర్ఎస్లో కలిసిపోతారని మరింత హాట్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడి నుంచి నిలబడాలి? ఎవరు పోటీ చేయాలి? అనేది వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో ఇదే జరిగిందని.. దానివల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.
బీజేపీ నేతల కుమ్మక్కు..
తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉండే.. రాష్ట్ర నేతల తప్పుడు విధానాలతో పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కు అవుతారని.. ఆ కుమ్మక్కు రాజకీయాల వల్లే బీజేపీకి చాలా లాస్ జరిగిందని అన్నారు రాజాసింగ్. ఈ విషయం ప్రతీ కార్యకర్తకు తెలుసునని.. కానీ, ఎవరూ బయటకు మాట్లాడరని.. స్పందిస్తే సస్పెండ్ అయిపోతారని అన్నారు.
Also Read : కవితకు షోకాజ్ నోటీసులు? ఖేల్ ఖతం!
ఆ రెండూ తోడు దొంగలేనా?
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రయత్నం జరిగిందని కవిత అంటే.. అవునంటూ రాజాసింగ్ ఇంకా స్ట్రాంగ్గా ప్రతిస్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రతీ ఎన్నికల్లో ఇలానే కుమ్ముక్కు రాజకీయం జరుగుతోందంటూ మరింత సంచలన మేటర్ బయటపెట్టారు. అంటే, బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలేనంటూ ఇన్నాళ్లూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అంతేగా.. అంతేగా.. అంటున్నారు.