MLA Adi Srinivas: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పరిశీలిస్తుండగా ఫ్లోర్ ఒక్కసారిగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కేసీఆర్ హయాంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని తాము చాలాసార్లు చెప్పామన్నారు. గతంలో అనేక ఆందోళనలు చేశామని.. ఈరోజు పరిశీలిస్తుండగా బేస్ కూలిపోవడం దానికి నిదర్శనం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత లేని కట్టడాలు నిర్మించిందని.. కమిషన్ల కోసం నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ కూలిపోయిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలనకు వెళ్లగా.. నిలబడిన ఫ్లోర్ కూలిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఈ నిర్మాణాలను తొలగించి.. నూతన కట్టడాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం కట్టడాలు కట్టి అడ్డగోలుగా సంపాదించారన్నారు. వారి పాలన డబ్బు దోచుకోవడం కోసమే జరిగిందని.. ప్రజలపై ప్రేమ ఏ మాత్రం లేదన్నారు.
గతంలో తాము చేసిన ఆరోపణలు నేడు నిజమయ్యాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేగాక.. కేటీఆర్ సోదరి కవిత స్వయంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని.. కేవలం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇళ్ళు మాత్రమే బంగారం అయ్యాయని వ్యాఖ్యానించిన విషయాన్నియ ఆయన ప్రస్తావించారు. కవిత వెళ్లిన ప్రతి చోట అవే ఆరోపణలు చేస్తున్నారని.. వేములవాడలో కూలిపోయిన వాటిపై కవిత స్పందిస్తారని భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఇంకెన్ని కూలుతాయో చూడాలన్నారు. రాజన్న ఆలయాన్ని రూ. 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.