Addanki Dayakar: హరీశ్ రావు మాటలు చిలక పలుకులు, సొల్లు పురాణం అని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేశారని, అప్పట్లో సాగునీటి శాఖ మంత్రులుగా ఉన్న హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం వంటి దౌర్భాగ్యపు ప్రాజెక్టులను నిర్మించారని, అది నేడు దేశంలోనే అతిపెద్ద వైఫల్యంగా చరిత్రకెక్కిందని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటిని దోచుకుంటోందనే సెంటిమెంట్ను రగిల్చి, ప్రజలను పక్కదోవ పట్టించాలని హరీశ్ రావు చూస్తున్నారని దయాకర్ విమర్శించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సి.డబ్ల్యూ.సి (CWC) ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదని, కనీసం మీటింగ్ మినిట్స్లో ఏముందో కూడా తెలియని అజ్ఞానంతో హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సౌత్ ఇండియా మీటింగ్ తిరుపతిలో జరిగినా, లేదా ఇతర కీలక జలవనరుల సమావేశాలు జరిగినా ఇంట్లో మొద్దుల్లా నిద్రపోయిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు నీటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. హరీశ్ రావు తన అరకొర జ్ఞానంతో జలజగడాలకు తెరలేపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతూ తెలంగాణ జల హక్కుల కోసం పోరాడుతోందని అద్దంకి దయాకర్ వివరించారు. కృష్ణా జలాల వాటాలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకున్న అన్యాయమైన ఒప్పందాలను పునర్నిర్వచించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ వాటాగా దక్కాల్సిన ప్రతి చుక్క నీటి కోసం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ, ఇటు కేంద్రంతోనూ కొట్లాడి సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అన్యాయం వల్ల ఒక తరం రైతులు నష్టపోయారని, వేల కోట్ల ప్రజల సొమ్ము వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హరీశ్ రావు ఇప్పటికైనా తన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. కేవలం పబ్లిసిటీ కోసం రోజుకో అబద్ధం చెబుతూ మీడియా ముందుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వాస్తవాలు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని, కాంట్రాక్టర్ల కోసం కాకుండా రైతుల కోసం ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలతో తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిల్చాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దయాకర్ హెచ్చరించారు.
Read Also: KCR: కేసీఆర్కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?