Chamala Kiran Kumar Reddy: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూసీ వాస్తవాలను ప్రజల ముందుంచిన 24 గంటల్లోనే.. కేటీఆర్ పోటీ ప్రజెంటేషన్ ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మూసీ అభివృద్ధి జరుగుతుందనే భయంతోనే కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ‘దరిద్రపు పాలన’ వల్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పుల పాలు అయిందని.. ఆ సమయంలో మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం సబర్మతి, గంగా నదుల తరహాలో మూసీని తీర్చిదిద్దడమేనని చామల కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీగా స్వయంగా సబర్మతి రివర్ ఫ్రంట్ను సందర్శించానని.. అక్కడ 21 కిలోమీటర్ల మేర పది వేల కుటుంబాలను తరలించి అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గుజరాత్లో అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మేయర్ ఇమ్మత్ సింగ్ పటేల్ కలిసి పనిచేశారని.. కానీ ఇక్కడ కేటీఆర్ కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మురికి కూపంలోనే ఉంచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో కట్టి కూలేశ్వరం చేసిన చరిత్ర కేటీఆర్దని.. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు వ్యయంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్, హరీష్ రావు మరియు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ కలిసి ఒకసారి సబర్మతి రివర్ ఫ్రంట్కు వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని చూడాలని ఎంపీ సూచించారు. తెలంగాణ మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లి ప్రజలకు వాస్తవాలు చూపించాలని సవాల్ విసిరారు. ప్రపంచమంతా తిరిగానని చెప్పుకునే కేటీఆర్కు థేమ్స్ నది, హాన్ నది అభివృద్ధి ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. కేవలం పేద ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పని చేస్తున్నారని.. కానీ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. 2023 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవలేదని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 ఇళ్లు మంజూరు చేసిందని.. ఇళ్లు కూలగొడుతున్నారనే కేటీఆర్ ప్రచారం పచ్చి అబద్ధమని చామల కిరణ్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయంలో చర్చకు తాను సిద్ధమని.. కేటీఆర్ సిరిసిల్లకైనా లేదా తన భువనగిరికైనా రావాలని సవాల్ విసిరారు. గాంధీ సరోవర్ నిర్మాణానికి కేవలం రూ. 70 కోట్లు ఖర్చవుతుందని సీఎం చెబితే.. రూ. 5 వేల కోట్లు అంటూ కేటీఆర్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేటీఆర్ తన వైఖరి మార్చుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు.
Read Also: Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ నెల 22 నుంచే రైతు భరోసా నిధులు!