MP Chamalla: చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. హైకోర్టు తీర్పులో ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పలేదని, కేవలం కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు విషయంలో సాంకేతిక అంశాలను ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఏ ప్రాతిపదికను సంబరాలు చేసుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల కష్టార్జితమైన లక్షల కోట్ల రూపాయలను కాళేశ్వరం పేరుతో వృథా చేశారని, అది కేవలం ఒక కుటుంబం బ్రాండ్ ఇమేజ్ కోసమే జరిగిందని చామల ధ్వజమెత్తారు. ‘మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరానికి గుండెకాయ అని చెప్పిన కేసీఆర్.. ఇవాళ రెండు పిల్లర్లు కుంగితే ఏమవుతుందని మాట్లాడటం హస్యాస్పదం’అని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ నీళ్లు నింప వద్దని హెచ్చరించిందంటేనే ఆ ప్రాజెక్ట్ వైఫల్యం అర్థమవుతోందని, ఈ వాస్తవాలను గ్రహించే ప్రజలు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారని ఆయన పేర్కొన్నారు.
నాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయని, కానీ కేసీఆర్ గూగుల్ మ్యాపులు చూసి కట్టిన ప్రాజెక్టులు మాత్రం కొద్ది కాలానికే కుంగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేసి, కార్పొరేషన్ల పేరుతో భారీ దోపిడకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక బీజేపీ వైఖరిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ దోపిడిపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చి సరైన బుద్ధి చెప్పారని, కేవలం సంబురాల రాంబాబుల తీన్మార్ డ్యాన్స్లతో వాస్తవాలు మరుగున పడవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తోందని, త్వరలోనే దోషులందరినీ చట్టం ముందు నిలబెట్టి తీరుతామని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: పాక్ ఇంట్లోకి వెళ్లి వేటాడిన భారత్.. పహల్గామ్ గాయానికి ‘సిందూర్’ ప్రతీకారం!