జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ బాంబు పేల్చారు. కేంద్రంతో రేవంత్ సర్కార్ ఓ కీలక ఒప్పందం చేసుకున్నదని. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేందుకు తాము రెడీగా ఉన్నామని సీఎం రేవంత్ కేంద్రం దగ్గర ఒప్పుకుని, సంతకాలు కూడా చేసి వచ్చారని జనం ముందుంచారు గులాబీ అధినేత. తమ హయాంలో కూడా మోడీ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడట దీని కోసం. తను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదని, దీంతో కక్ష పెంచుకున్న కేంద్రం.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్ల నిధులను ఆపేసిందని గుర్తు చేశారు. అయితే ఆ రూ. 35వేల కోట్ల కోసం రేవంత్ సర్కార్ .. ఈ ప్రతిపాదనకు ఓకే అన్నారని కేసీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి వచ్చారని, అందుకే ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్న కేసీఆర్.. ఈ మోటర్లకు మీటర్ల బిగింపు కుట్రను మనమంతా అడ్డుకుందామని పిలుపునివ్వడం కూడా చర్చనీయాంశమైంది. అవసరమైతే యుద్దమే చేద్దామని కేసీఆర్ అనడం.. దీంట్లో వాస్తవం ఉంది కాబట్టే ఆయన మరీ అంత నొక్కి చెప్పారనే ప్రచారం జరిగింది. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే అంశాన్ని మెల్లగా పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే కేంద్రం మొదటి నుంచి ఈ మోటర్ల బిగింపు అంశాన్ని తెరమీదకు తెస్తున్నదని, తెలంగాణలో తాను అడ్డుకున్నానని, కానీ కాంగ్రెస్కు డబ్బులు కావాలి.. ఆ ఆపేసిన నిధులు విడుదల చేయండి.. మేము రెడీ దానికి.. అని రేవంత్ అంగీకరించి వచ్చినట్టు చేసిన ప్రచారాన్ని.. కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ కనీసం ఖండించకపోవడం దీన్ని మరింత బలపరిచినట్టయ్యింది.
కానీ, ఇవాళ కిషన్రెడ్డి దీనిపై స్పందించారు. ఇదంతా ఉత్తదేనని కొట్టిపారేశారు. అప్పుడూ ఆ ప్రాతిపదన లేదు.. ఇప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ స్ట్రాటజీలో భాగమేనన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం కూడా చర్చకు వచ్చింది. నిజంగా కేసీఆర్ చెప్పింది పరిశీలిస్తే.. ఇలాంటి వ్యూహాలు పన్ని.. అందులో వైరిపక్షాన్ని ఉచ్చులో పడేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకుంటారు. ఉద్యమ సమయంలో కూడా ఆయన పాలకులపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించేవారు. జనం నుంచి తమ పార్టీకి మైలేజీ వచ్చే విధంగా ఆయన సందర్భోచితంగా చేసే ఆరోపణలు.. పాలక పక్షాన్ని ఇరుకన పెట్టడంతో పాటు.. బీఆరెస్ పార్టీకి మైలేజీ ఇచ్చేవి. అలాంటి వ్యూహాల్లో ఒకటిగానే మోటార్లకు మీటర్ల అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మీకో విషయం తెలుసా.. మీరొట్టి అమాయకులు.. ఢిల్లీలో ఏం జరిగిందో నేను చెబుతా.. వినుర్రి.. అని కేసీఆర్ జనంలో ఆసక్తి రేకెత్తించి.. అది కచ్చితమైన సమాచారమేననే విధంగా నమ్మకం కలిగేలా వ్యవహరించి, మాట్లాడి తన వ్యూహాన్ని అమలు పరిచేందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే వాదన కొనసాగుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది. ఒక్క రేవంతే అన్నింటికీ జవాబివ్వాలా? మంత్రులు సైలెంట్గా ఎందుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి ఏం చేస్తున్నాడు? అనే చర్చ ఆ పార్టీలనే జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో వ్యవసాయ మోటర్లకు మీటర్ల అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ఆందోళనలు, పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, ఈ అంశంపై స్పష్టత కోసం అందరి దృష్టి ప్రభుత్వ నిర్ణయాలపై నిలిచింది.