Nagarjuna: మంత్రి కొండా సురేఖ, సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం సుఖాంతమైంది. మంత్రి కొండా సురేఖ నిన్న బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో, హీరో నాగార్జున సానుకూలంగా స్పందించి, వివాదానికి తెరదించారు.
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున గతంలో నాంపల్లి కోర్టులో పరువు నష్టం (డిఫమేషన్) దావా వేశారు. అయితే, నిన్న మంత్రి సురేఖ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ తెలియజేయడంతో, నాగార్జున ఈ రోజు కోర్టులోని ఆ డిఫమేషన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీకి, మంత్రి సురేఖకు మధ్య నెలకొన్న ఈ వివాదం పూర్తిగా ముగిసినట్లయింది.
సినీ హీరో నాగార్జున అక్కినేని, మంత్రి కొండా సురేఖ మధ్య నడుస్తున్న కేసుకు సంబంధించి నాంపల్లిలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును గురువారం (నవంబర్ 13, 2025) కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు విచారణకు ఫిర్యాదిదారుడు (Complainant) నాగార్జున అక్కినేని, నిందితురాలు (Accused) కొండా సురేఖ ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. అయితే, వారి తరపున దాఖలైన పిటిషన్లను కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో, ఫిర్యాదిదారుడైన నాగార్జున భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 280 కింద ఒక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు (withdrawing) వర్చువల్గా కోర్టుకు తెలియజేశారు.
కేటీఆర్, తనను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడంతో తాను భావోద్వేగానికి గురై నాగార్జున కుటుంబం మీద విమర్శలు చేయాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘‘ ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనే ఒక ఆలోచనతో నేను బేశరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది.’’ అని అన్నారు.
నటులు నాగచైతన్య – సమంత విడాకులకు కేటీఆర్ కారణం అంటూ 2024 అక్టోబరు 2న మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ పరువుకు తీవ్ర నష్టం కలిగించాయంటూ హీరో నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే, తమ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన మంత్రి సురేఖపై నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 356 కింద ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
కొంతకాలంగా నడుస్తున్న ఈ వివాదానికి మంత్రి కొండా సురేఖ నిన్న బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో ఫుల్ స్టాప్ పడింది. ఆమె క్షమాపణను సానుకూలంగా స్వీకరించిన నాగార్జున, ఇవాళ కోర్టులో కేసును ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం పూర్తిగా ముగిసినట్లయింది.
Read Also: Globetrotter : రాజమౌళి కీరవాణి లను కింద కూర్చుని పెట్టిన సుమ, రియల్ లైఫ్ శివగామి