Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు ప్రచార సరళి వరకు వ్యూహాత్మకంగా ఎన్నికల సమరాన్ని కొనసాగిస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం ఆర్థిక సామాజిక బలాబలాలపై సమీక్ష చేసి అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటంలో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) ఆదివారం మొత్తం 11 డివిజన్ల లో ప్రచారం చేపట్టారు. అదేవిధంగా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు సూచనలు చేస్తూ తమ అభ్యర్థుల గెలుపుకు అవసరమైన సపోర్ట్ చేస్తున్నారు. కీలకమైన మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో మిర్యాలగూడ మున్సిపాలిటీ సహా ఇతర మున్సిపాలిటీలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చీరలతో పాటు డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Ration Rice Scam: పైసలు కొట్టు.. బియ్యం పట్టు.. జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా..!
మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో ఆదివారం ఉదయం ఓటర్లకు చికెన్ చేయగా సాయంత్రం లిక్కర్ ను పంపిణీ చేయడం గమనార్హం. మిర్యాలగూడ పట్టణంలోని పలు ఏరియాలో యువకులకు దావతులు ఏర్పాటు చేయటం విశేషం. ఎలక్షన్ అథారిటీ ఏర్పాటుచేసిన టీమ్స్ తమ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల వ్యవహారం గుట్టుగా విజయవంతంగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఐదు గంటలకు ముగియనుండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ల్యాబీయింగ్కు తెర తీశారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ రేస్లో ఉన్న అభ్యర్థులు తమ వార్డుల్లో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు, చోటామోటా లీడర్లకు భారీగా డబ్బులు ఆఫర్ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ స్వతంత్ర అభ్యర్థులకు ఉన్న క్యాపబిలిటీని బట్టి రూ. 3 నుంచి 5 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు..