HYDRAA: కూకట్పల్లిలోని నల్ల చెరువు పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ బుధవారం చెరువును సందర్శించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 6వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ చెరువును అధికారికంగా ప్రారంభించనున్నారు.
హైడ్రా మొదటి విడతలో భాగంగా అభివృద్ధికి చేపట్టిన 6 చెరువులలో ఇప్పటికే బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రానున్న నాలుగైదు రోజుల్లో పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువుతో పాటు, కూకట్పల్లి నల్ల చెరువును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బుధవారం నాటి పర్యటనలో కమిషనర్ చెరువు చుట్టూ నాటిన మొక్కలను పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా పెద్ద మొత్తంలో నీడనిచ్చే మొక్కలు నాటాలని, పార్కులను మరింతగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
చెరువు నీటిని శుద్ధి చేసేందుకు STP(Sewage Treatment Plant) ఏర్పాటుకు సంబంధించి జలమండలి అధికారులతో కమిషనర్ చర్చించారు. చెరువు పరిసరాల్లో ఇప్పటికే 5-6 కిలోమీటర్ల దూరం నుండి ప్రజలు ఇక్కడ వాకింగ్ కోసం వస్తున్నారు. అలాగే.. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటస్థలాలు , వ్యాయామం చేసే వారి కోసం ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా.. పార్కుల అభివృద్ధి , పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు.
2024 సెప్టెంబర్లో ఈ చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. అయితే, నేడు అదే చెరువు రూపురేఖలు మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు అభివృద్ధి వల్ల కేవలం పర్యాటక రంగమే కాకుండా, స్థానికంగా వరద ముప్పు తప్పుతుందని, భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని కమిషనర్ రంగనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం పనులు పూర్తయిన తర్వాత నల్ల చెరువు నగరం నడిబొడ్డున ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా నిలవనుంది.
కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
మార్చి 6 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు
నల్ల చెరువులో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన రంగనాథ్
HYDRAA Commissioner Ranganath… pic.twitter.com/hf8R9fDWSJ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2026