Nampally Numaish 2026: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 85వ నూమాయిష్ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు జనవరి 1న నుమాయిష్ ను ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ఇప్పటికే దేశవిదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు సుమారు 1050 స్టాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
అలాగే ఫైర్ ఇంజన్లతో పాటు సేఫ్టీ మెజర్స్ను మెయింటైన్ చేస్తున్నారు. నుమాయిష్ దృష్ట్యా నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ ఎగ్జిబిషన్ లో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కళాకృతులు, చిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. హస్తకళలు, దుస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. సౌత్, నార్త్ ఇండియా స్నాక్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.
ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ జరగనుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఎంట్రీ ఫీజును రూ.50 నిర్ణయించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. నుమాయిష్ తో వచ్చే ఆదాయాన్ని 19 విద్యా సంస్థలకు అందజేసి విద్యాభివృద్ధికి కృషి చేయనున్నారు.
నూమాయిష్ ఎగ్జిబిషన్ జరిగే ప్రాంతంలో మొత్తం 120 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అంబులెన్సుల సర్వీస్ అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు 1.50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ సంపులు, 82 హైడ్రాంట్లు, రెండు ఫైరింజిన్లు సిద్ధం చేశారు. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం వాలంటీర్లతో వీల్ ఛైర్లు అందుబాటులో ఉంచారు.
నుమాయిష్ జరిగే 46 రోజుల పాటు నాంపల్లి చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సుల్తాన్ బజార్, జంబాగ్ నుంచి వచ్చే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వెహికల్స్ ఎంజే మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తున్నారు.
బషీర్ బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం వద్ద అబిడ్స్ వైపు మళ్లించారు. బేగంబజార్ ఛత్రి నుంచి మలకుంట వైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుసలం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తున్నారు.
Also Read: హైదరాబాద్ నగరం ముస్తాబు.. జనవరి 1 నుంచే ‘నుమాయిష్-2026’.. పూర్తి వివరాలివే!
దారుసలం నుండి అఫ్జల్గంజ్ లేదా అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద బేగంబజార్, సిటీ కాలేజ్, నయాపూల్ వైపు మళ్లిస్తున్నారు. మూసాబౌలి, బహదూర్పురా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సహా భారీ, మధ్య తరహా వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు.