Jubilee Hills: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు తెలిసిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించి.. పాలక పక్షానికి మరింత ఉత్సాహాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత దారుణ ఓటమిని చవిచూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఒక రకంగా పరీక్షగా మారింది.
⦿ వార్ వన్ సైడే..
ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి రౌండ్ నుండే దూసుకుపోయిన కాంగ్రెస్.. అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ కంటే ముందుంది. కేవలం ఒక మూడో రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీ సాధించినప్పటికీ..ఆ తర్వాత కాంగ్రెస్ జోరు ముందు ఆ ఆధిక్యం కొట్టుకుపోయింది. చివరికి, నవీన్ యాదవ్ 25 వేలకు పైగా.. భారీ మెజారిటీతో విజయం సాధించారు.
⦿ వర్కౌట్ కానీ సానుభూతి..
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించినప్పటికీ.. నవీన్ యాదవ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా ఉన్న బలం ముందు నిలబడలేకపోయారు. ముఖ్యంగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కు కాంగ్రెస్ నాయకత్వం టికెట్ ఇవ్వడం, ఆయనకు ముస్లిం మైనారిటీల నుంచి అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) మద్దతు కూడా తోడవ్వడంతో విజయం సులువు అయింది. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటు బ్యాంకును నిరూపించుకున్న నవీన్ యాదవ్కు ఈసారి కాంగ్రెస్ అండగా నిలవడంతో అది తిరుగులేని విజయంగా మారింది.
⦿ సంక్షేమ పథకాలే గెలిపించాయి..
ఈ విజయం కేవలం నవీన్ యాదవ్ వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్రగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరు గ్యారంటీలు, ఇతర ప్రజాకర్షక కార్యక్రమాలు పట్టణ ఓటర్లను కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేశాయని స్పష్టమైంది.
⦿ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..
నవీన్ యాదవ్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారిందని నాయకులు పేర్కొంటున్నారు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలుపు, ఇప్పుడు జూబ్లీహిల్స్లో చారిత్రక విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కాంగ్రెస్ పుంజుకుంటున్న తీరును స్పష్టం చేసింది.
⦿ బీఆర్ఎస్కు ఇది ఎదురుదెబ్బ
ఈ ఉప ఎన్నిక ఫలితం స్థానిక సంస్థల ఎన్నికలపై, ముఖ్యంగా త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ గెలుపుతో వచ్చిన జోష్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగించే అవకాశం ఉందని, తద్వారా బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ బైపోల్ విజయం కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్గా, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పవచ్చు. జూబ్లీలో గెలిచిన నవీన్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, తన విజయం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.
ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. ‘కారు’లో కలవరం, గాంధీ భవన్లో సంబరాలు