Ganja Racket: నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన గంజాయి విక్రయాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సాయి చైతన్య మీడియాకు వెల్లడించారు. ఈ ఉదంతంలో విద్యార్థులు, ఒక మైనర్ ప్రమేయం ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన బాల్కొండ పోలీసులు చాకచక్యంగా దాడులు నిర్వహించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా.. అందులో ఇద్దరు విద్యార్థులు, ఒకరు మైనర్ అని పోలీసులు గుర్తించారు. మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ముఖ్యంగా మైనర్ల ద్వారా గంజాయి విక్రయాలు జరిపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొదటిసారి ఒక మైనర్తో గంజాయి అమ్మించడం చూస్తున్నాం.. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి రవాణా చేస్తున్న ముఠాల పట్ల ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
విద్యార్థులు పెడదారి పట్టకుండా ఉండటంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని సీపీ పేర్కొన్నారు. పిల్లల ప్రవర్తనను, వారి స్నేహితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాలకు బానిసై జైలు పాలవ్వడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Also Read:నెల్లూరు జనసేనలో నాయకత్వ సెర్చ్.. పవన్ సైన్యం.. రథసారధి ఎక్కడ?