Telangana Govt: కొత్త విద్యా సంవత్సరం మొదలుకాకముందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపు వ్యవహారం గతేడాది న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దానిపై ముందుగా ఫోకస్ చేసింది. ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కొత్త విధానం తెచ్చింది ప్రభుత్వం.
విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకు కొనసాగుతున్న 15 శాతం ఓపెన్ కోటాను తొలగించింది. ఆ కోటాను తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. అందుకు సంబంధించి జీవోను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేశారు.
పెరగనున్న ఇంజనీరింగ్ సీట్లు
ఇంజినీరింగ్, టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సుల్లో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు. మిగతా 15 శాతం ఓపెన్ కేటగిరిలో సీట్లు నింపేవారు. వచ్చే విద్య సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందనున్నారు. ఇకపై ఏపీ స్టూడెంట్స్ ఆ సీట్లకు పోటీ పడే అవకాశం లేదు.
విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత, 15 శాతం నాన్ లోకల్ కోటాకు ఎవరు అర్హులనే దానిపై స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. 2011లో జారీ చేసిన జీవో 74లో ప్రకారం.. ఆ కోటాకు ఓయూ రీజియన్తోపాటు ఆంధ్రా వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు పోటీ పడేవారు. తాజా జీవోలో ఏయూ, ఎస్కేయూలను తొలగించింది. కేవలం ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది.
ALSO READ: సెంట్రలో యూనివర్సిటీలో కూలిన భవనం
స్థానికేతర కోటా సీట్లను తెలంగాణవాసులకే కేటాయించడంతో ఇంజినీరింగ్లో అదనంగా సుమారు 3 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది వరకు ఏపీ విద్యార్థులు పోటీపడే అవకాశం ఉండేది. ఆ కోటా కింద ఉండే దాదాపు 12 వేల సీట్లలో 3 వేల వరకు వారు మెరిట్ ఆధారంగా పొందుతారు.
స్థానికత క్లారిటీ
తెలంగాణ స్థానికత క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మాదిరిగా 6 నుంచి- ఇంటర్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. దాదాపు ఏడేళ్లు తెలంగాణలో చదవి ఉండాలి. తెలంగాణలో 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదవాలి. అదీ లేకుంటే 6-9వ తరగతి వరకు లేదా 7-10 వరకు చదివినా స్థానికుడిగా పరిగణిస్తారు. సీట్ల విషయంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల చదువును చూస్తారు.
స్థానికేతర కోటా 15 శాతానికి తెలంగాణలో చదివిన పిల్లలతోపాటు గతంలో మాదిరిగా మూడు కేటగిరీల వారు పోటీపడవచ్చు. ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా పదేళ్ల పాటు తెలంగాణలో నివసించినవారి పిల్లలు పోటీ పడొచ్చు. పదేళ్లపాటు ఉన్నట్లు మీ-సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలి.
ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి కూడా అర్హులు.