అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం నెలకొన్నది. గత కొంతకాలంగా ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు మరోసారి యాక్టివ్ అయ్యారు. జిల్లా స్థాయి నేతల నుంచి మొదలు జాతీయ స్థాయిలోనూ లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆ తర్వాత మంత్రులు, టీపీసీసీ చీఫ్, అక్కడ కూడా పనికాకపోతే తమకు ఉన్న పలుకుబడి జాతీయ స్థాయి నేతలతోనూ మంతనాలు చేస్తున్నట్టు పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అవకాశం రాకుండా ఉన్న బుజ్జగింపు నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా చాన్స్ దక్కుతుందని టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా నామినేటెడ్, పీసీసీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా వాటి భర్తీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నిన్న ఢిల్లీ జరిగిన ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలకు రాష్ట్ర నేతలు ఈ విషయంపై వివరించగా.. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ క్లారిటీ సైతం ఇచ్చారు. మార్చి 15లోపు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనున్నట్లు తెలిపారు.ఈ పోస్టుల కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావహులు ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో దాదాపు 37 వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.వీటితో పాటు గతంలో నామినేట్ చేసిన పోస్టులు కాల వ్యవధి కూడా ముగిసినవి కొన్ని ఉన్నాయి. ఖాళీ పోస్టులు, గడువు ముగిసినవి వాటిని ప్రస్తుతం భర్తీ చేయాల్సి ఉన్నది. వరుసగా ఎన్నికలు వచ్చినందున నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికలు అయిపోవడంతో ఈ పదవుల భర్తీపై రాష్ట్ర ముఖ్య నేతలు దృష్టి సారించారు.దీనితో పాటు పీసీసీ కార్యవర్గాన్ని కూడా చేపట్టాల్సి ఉంది. మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక సహజంగానే ఈ పీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాల్సి ఉంది.
కానీ,ఈ పోస్టులు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే పీసీసీ కార్యవర్గాన్నీ మార్చి రెండో వారంలో భర్తీ చేయనున్నట్టు టీపీసీసీ చీఫ్ తెలిపారు. పీసీసీ కార్యవర్గ పోస్టులపైన ఆశలు పెట్టుకున్న చాలా మంది ఆశావాహుల్లో ఆ ప్రకటన ఉత్సాహం నింపింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల నియామకం వాయిదా పడిన విషయం తెలిసిందే. అక్కడ కూడా తాజాగా పదవులను భర్తీ చేయాల్సిన సమయం వచ్చిందని చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో రెబల్స్గా పొటీ చేసి విత్ డ్రా చేసుకున్న నేతలు.. అసంతృప్త నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ దక్కుతుందని ప్రచారం జరుగుతుండగా.. కొందరు కీలక నేతలు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవడానికి పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.