Tatikonda Rajaiah: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పదవి ఊడిపోతుందనే భయంతోనే భట్టి విక్రమార్క స్టేషన్ ఘనపూర్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారని ఆయన విమర్శించారు. అసలు ఘనపూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి గానీ, భట్టి విక్రమార్క గానీ చేసిందేమీ లేదని, అక్కడ వారు ఒరగబెట్టింది శూన్యమని రాజయ్య ఎద్దేవా చేశారు.
ఇరిగేషన్ రంగంలో ఘనపూర్ నెంబర్ 1
బీఆర్ఎస్ హయాంలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలిచిందని రాజయ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లు నిర్మించి, 1.58 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు గుర్తుచేశారు. దాదాపు 104 కోట్ల రూపాయల వ్యయంతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఘనపూర్లోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరాకూ నీళ్లు అందించిన ఘనత కేసీఆర్దేనని, ఒక పాలేరులాగా తాను కాల్వల వెంట తిరిగి చెరువులను నీళ్లతో నింపానని రాజయ్య భావోద్వేగానికి లోనయ్యారు.
విద్య, రవాణా రంగాల్లో భారీ ప్రగతి
మౌలిక వసతుల కల్పనలో ఘనపూర్ను తానే ముందుంచానని రాజయ్య వివరించారు. దాదాపు 1860 కోట్ల భారీ బడ్జెట్తో నియోజకవర్గంలో రవాణా రంగాన్ని, రోడ్ల నెట్వర్క్ను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణలోనే మరెక్కడా లేని విధంగా స్టేషన్ ఘనపూర్కు అత్యధిక సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయం, విద్య, రవాణా రంగాలను తాము ఇంతలా అభివృద్ధి చేస్తే.. గత 20 ఏళ్లలో ఘనపూర్లో అసలు అభివృద్ధే జరగలేదని భట్టి విక్రమార్క మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
కడియం శ్రీహరికి సూటి ప్రశ్నలు
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా రాజయ్య నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు మంత్రిగా ఉండి కడియం ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో రాజయ్య అనే నాయకుడు అడ్డుగా ఉన్నాడు కాబట్టే, ఇన్నాళ్లూ కడియం ఇక్కడికి రాలేకపోయాడని అన్నారు. తాము కష్టపడి అభివృద్ధి చేసిన జిల్లాకు వచ్చి.. భట్టి, కడియం ఇద్దరూ కలిసి పనికిరాని, అర్థరహితమైన మాటలు మాట్లాడుతున్నారని తాటికొండ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: డ్యూటీలో ఉండగా.. కెనడాలో భారతసంతతి పోలీసు వీరమరణం!