Old Student Donation to Osmania University(Telangana news updates): చదువు చెప్పిన గురువులను జీవితంలో ఎప్పటికీ మరచిపోకూడదు. వాళ్లే లేకపోతే.. జీవితానికి బంగారు బాటలు వేసేవారెవరుంటారు ? విద్యాబుద్ధులు నేర్పి.. భవిష్యత్తుకు దారి చూపిన అమ్మలాంటి కళాశాలకు ఒక ఓల్డ్ స్టూడెంట్ భారీ విరాళమిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో నూతన తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికై పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
1968లో ఓయూలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. చదువును నేర్పి.. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన కళాశాలకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమినార్ హాల్ కు ప్రొ.వి.ఎం. గాడ్గిల్ ఆడిటోరియంగా, కమ్యూనిటీ హాల్ కు ప్రొ. అబిద్ అలీ పేర్లు పెట్టాలని సూచించారు. అనంతరం కృష్ణను వీసీ ప్రొ.రవీందర్ అభినందించారు. చదువుకున్నామా, బయటికెళ్లి ఉద్యోగం చేసుకున్నామా అన్నట్లు ఉండే ఈ రోజుల్లో.. పూర్వ విద్యార్థి ఓయూకు భారీ విరాళం ప్రకటించడంపై కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది.