Acb Raids In Ou : ఉస్మానియా యూనివర్శిటీలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ బిల్డింగ్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) శ్రీనివాస్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, విద్యాసంస్థ అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లను బెదిరిస్తూ లంచాలు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఓయూ పరిధిలోని మానేరు హాస్టల్లో ఇటీవల.. సివిల్ పనులు పూర్తి చేసిన ఓ కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లు పాస్ చేయడమే ఈ కేసుకు మూలకారణం. సుమారు రూ.14 లక్షల విలువైన బిల్లు విడుదల కావాలంటే రూ.11 వేలు లంచం ఇవ్వాల్సిందేనని డీఈ శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పనులు పూర్తయ్యాయని, అన్ని నిబంధనలు పాటించినప్పటికీ కావాలనే బిల్లు ఆలస్యం చేస్తూ లంచానికి ఒత్తిడి తెచ్చాడని బాధిత కాంట్రాక్టర్ వాపోయాడు.
డీఈ శ్రీనివాస్ ఇప్పటికే ఒకసారి లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. వారం రోజుల క్రితం బాధితుడి నుంచి ఫోన్పే ద్వారా రూ.5,000 తీసుకున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మిగిలిన రూ.6,000 ఇవ్వాలని పదేపదే ఒత్తిడి చేయడంతో, ఇక భరించలేక కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, డీఈ శ్రీనివాస్ను కార్యాలయంలోనే రూ.6,000 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ స్పందిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ పనుల బిల్లులు పాస్ చేయడంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టాం. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ట్రాప్ నిర్వహించాం. డీఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, డీఈ శ్రీనివాస్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ పొందనున్నాడు. రిటైర్మెంట్ సమీపిస్తున్నా కూడా, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాల్సిన నైతిక విలువలను పక్కన పెట్టి.. అక్రమ సంపాదన వైపు మొగ్గు చూపడం పట్ల విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఘటనతో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న సివిల్ పనులపై అనుమానాలు పెరుగుతున్నాయి. గతంలోనూ బిల్లుల ఆలస్యం, పనుల నాణ్యతపై కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకోవడంతో లోపలి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.
Also Read: పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది.. రెండేళ్లలో చేసి చూపించాం: మంత్రి సీతక్క సవాల్
ఏసీబీ అధికారులు ప్రస్తుతం డీఈ శ్రీనివాస్ ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలు, గతంలో చేసిన పనులపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే తరహాలో మరెవరైనా అధికారుల పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగనుంది. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థపై మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.