Minister Seethakka: రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61.24 శాతం స్థానాల్లో విజయం సాధించి అగ్రభాగంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగులోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ములుగు నియోజకవర్గంలోని 105 గ్రామ పంచాయతీలకు గాను 85కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని, మరో నాలుగు చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు.
దొరల అహంకారాన్ని అణిచివేస్తూ జనరల్ సీట్లలోనూ బీసీ అభ్యర్థులను నిలిపి గెలిపించుకున్నామని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సొంత గ్రామమైన దేవగిరిపట్నంలోనూ కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, కుల గణన కోసం అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మోకాలడ్డిందని, దీనివల్ల రూ. 3వేల కోట్ల నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో పోరాడుతూనే గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 10 వేల ఇళ్లు కూడా ఇవ్వలేదని, తాము రెండేళ్లలో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ములుగు మున్సిపాలిటీ, మెడికల్ కాలేజీ బిల్లులు సాధించామని, మల్లంపల్లి మండలం ఏర్పాటు చేశామని వివరించారు. పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకున్న అవినీతిపరుల సంగతి చూస్తానని హెచ్చరించారు. 76 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మంత్రి అయిన ఆదివాసీ బిడ్డనైన తనపై, తాడ్వాయిలో భూములు లాక్కుంటానని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మేడారం జాతర నిధులను దోచుకున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. మూడో విడత ఎన్నికలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సొంత గ్రామమైన దేవగిరి పట్నంలోనూ కాంగ్రెస్ అభ్యర్థే గెలిచారని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ 62 శాతం స్థానాలను కైవసం చేసుకుందని తెలిపారు.
రెండు విడతల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కారణంగా గత రెండేళ్లుగా సుమారు రూ.3000 కోట్ల నిధులు ఆగిపోయాయని, మార్చి లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయితే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి సీతక్క వివరించారు.