Palakurthi Politics: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిల అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా స్థానిక నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఝాన్సీ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్గా బరిలోకి దిగిన అసమ్మతి నేతలు, అధికారిక అభ్యర్థులను ఓడించి తమ పట్టు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసమ్మతి నేతలంతా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి, ఎమ్మెల్యే, ఆమె అత్త తీరుపై ఫిర్యాదు చేశారు.
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి పనుల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, వీరి తీరుతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మీనాక్షికి, పీసీసీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. “కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకున్నారు. గతంలో ఒక ట్రస్ట్ పేరుతో కాలువలు తీసామని చెప్పి, దానికి ఎంపీ నిధులు కూడా వాడుకున్నట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సుమారు రూ. 40 నుండి 50 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎంపీ నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు. కానీ ఆ నిధులు ఏమయ్యాయో, ఏ గ్రామానికి ఖర్చు పెట్టారో ఎమ్మెల్యే గానీ, ఝాన్సీ రెడ్డి గానీ కార్యకర్తలకు చెప్పడం లేదు.” అని ఆరోపించారు.
ఎంపీ మిగతా ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని, కానీ పాలకుర్తికి మాత్రం రావడం లేదని నేతలు తెలిపారు. దీనిపై ఎంపీని ప్రశ్నిస్తే.. “నన్ను ఎమ్మెల్యే ఆహ్వానించాలి కదా.” అని సమాధానం ఇస్తున్నారని, దీన్ని బట్టి ఎమ్మెల్యే తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
“అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్కు 47,000 ఓట్ల భారీ మెజారిటీ కట్టబెట్టారు. కానీ ఎమ్మెల్యే, ఆమె అత్త తీరు వల్ల ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 2,000 మెజారిటీ వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా నష్టపోతుంది. తక్షణమే అధిష్టానం జోక్యం చేసుకుని, ఝాన్సీ రెడ్డి పెత్తనం నుంచి పాలకుర్తి కాంగ్రెస్ను కాపాడాలి.” అని నేతలు ముఖ్యమంత్రిని, పీసీసీని కోరారు.
Read Also: కవిత పార్టీతో లాభమెవరికి? నష్టమెవరికి?