తెలంగాణలోని పాఠశాలల్లో రెండో భాషగా తెలుగుని తప్పనిసరి సబ్జెక్ట్ గా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని, తమ పిల్లలకు అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు కొంతమంది పేరెంట్స్. తెలుగు భాషను తప్పనిసరి చేయొద్దని, భాషను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ తమకు ఉండాలని డిమాండ్ చేస్తూ పేరెంట్స్ రోడ్డెక్కారు. ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఎందుకీ ఆందోళన..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు భాష విషయంలో నూతన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగుని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ.. ఇకపై తెలంగాణలో తెలుగుని రెండో భాషగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డ్.. ఇలా సిలబస్ ఏదయినా తెలుగు మాత్రం రెండో భాషగా ఉండాల్సిందే. అంటే రాబోయే విద్యా సంవత్సరం 2025-26లో ఏ మీడియం విద్యార్థులైనా తెలుగుని కచ్చితంగా చదవాల్సిందే. కానీ ఈ నిర్ణయంతో తమ పిల్లలు ఇబ్బంది పడతారని అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు.
పేరెంట్స్ వ్యతిరేకత..
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని స్కూల్స్ లో హిందీ లేదా ఉర్దూ రెండో భాషగా బోధిస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి వాటి స్థానంలో కచ్చితంగా తెలుగుని బోధించాలి. తెలుగు బోధనను సులభతరం చేస్తూ ‘సింగిడి’ స్థానంలో ‘వెన్నెల’ను ప్రవేశ పెట్టారు. అంటే ప్రామాణిక తెలుగు బదులు, సరళమైన తెలుగుని బోధిస్తారనమాట. అయినా కూడా ఈ నిర్ణయాన్ని కొందరు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లలు ఇబ్బంది పడతారని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. చదువులో విద్యార్థులకు భాషను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బంది పడతారని అంటున్నారు.
పేరెంట్స్ ప్రతిపాదన..
తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ నిర్ణయం ఇంకా మెమో రూపంలోనే ఉందని అంటున్నారు. ఫిబ్రవరి 25న, తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ ఈమేరకు ఒక మెమో మాత్రమే జారీ చేసింది. అది ప్రభుత్వ ఉత్తర్వుగా మారేందుకు సమయం పడుతుందని అంటున్నారు. మరి తల్లిదండ్రుల ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. మధ్యే మార్గంగా తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగుని థర్డ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టి, విద్యార్థులకు అలవాటైన తర్వాత రెండో భాషగా తీసుకు రావచ్చని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మారుతున్న కాలం దృష్ట్యా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా మారింది. అయితే తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ గా ఉంటే కనీసం మాతృభాషలో విద్యార్థులకు ప్రాథమిక జ్ఞానం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పటికిప్పుడు తెలుగు తీసుకొస్తే పిల్లలు చదవలేరేమోననేది వారి అనుమానం. ఈ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి. లేదా ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేయాలి.