Janasena Telangana Victory: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పార్టీ ఉద్భవించిన తెలంగాణ గడ్డపై తొలిసారి విజయలక్ష్మి రూపంలో అడుగు పడటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పోరాట పటిమ, సంస్కృతి సంప్రదాయాల శక్తి నింపుకున్న తెలంగాణ నేల తల్లికి ఆయన హృదయపూర్వక పాదాభివందనం చేశారు. పార్టీ తొలినాళ్లలో భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు, గతుకుల దారి ఉన్నప్పటికీ, మిణుకుమిణుకుమనే ఆశతోనే ప్రయాణాన్ని ప్రారంభించామని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ విజయం వెనుక పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీర మహిళలు, జనసైనికుల నిరంతర కృషి ఉందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఝాన్సీ లక్ష్మీభాయి స్ఫూర్తితో మహిళలు, ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎన్ని ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడ్డారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,998 వార్డులు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన పార్టీ 332 చోట్ల పోటీ చేసింది. ఈ పోటీలో పార్టీకి ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ స్థానం దక్కాయి. ఇది చిన్న విజయంగా కనిపించినా, ఒక మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే మొలకెత్తుతుందని, విశ్వ విజేత అయినా తల్లి గర్భంలో అణువంతే ఉంటాడని ఆయన ఉదాహరించారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ జనసేన అభ్యర్థులుగా సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని అందిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పార్టీ ఉద్భవించిన నేలపై దక్కిన ఈ తొలి విజయం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కోటి రతనాల వీణ’ అయిన తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం ఈ లేలేత అడుగులతోనే మొదలైందని ఆయన అభివర్ణించారు.
చివరగా, తెలంగాణ నేల తల్లికి ఉన్న సాహితీ సౌరభాన్ని, అణువణువునా నిండిన పోరాట పటిమను స్మరిస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని జనసేనాని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Read Also: GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!